గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదానికి కారణం అక్రమ కనెక్షన్ లేనా?
posted on May 20, 2025 10:10AM

హైదరాబాద్ పాతబస్తీ గుల్జార్ హౌస్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 17 మంది మృత్యువాత పడిన విషాద ఘటన కలకలం రేపింది. అగ్నిప్రమాద కారణాలపై సంబంధిత శాఖల అధికారులు విచారణ చేపట్టారు. వారి విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. చూస్తున్నాయి. షార్ట్ సర్క్యూట్, ఏసీ కంప్రెషర్ పేలుడు కారణాలుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించినా, అక్రమ విద్యుత్ కనెక్షన్ లు కూడా అగ్నిప్రామాదానికి ప్రధాన కారణంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఆరోపణలపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మామూలుగా అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంత పెద్ద ఎత్తున మంటలు చెలరేగే అవకాశం ఉండదని విద్యుత్ శాఖ చెబుతోంది. ఏసీ కంప్రెషర్ బ్లాస్ట్ కారణంగానే ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించిందని అంటోంది. అదే సమయంలో అక్రమ విద్యుత్ కనెక్షన్ కోణంలోనూ విచారిస్తున్నట్లు విద్యుత్ శాఖ పేర్కొంది. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని తెలిపారు విద్యుత్ శాఖ చెబుతోంది. ఇంతకీ అక్రమ కనెక్షన్ల వ్యవహారం ఏమిటంటే..
నగల దుకాణం మూసేయగానే హైటెన్షన్ వైర్ నుంచి.. కొక్కేల ద్వారా స్థానికులు కరెంట్ కనెక్షన్ తీసు కుంటున్నారు. ఈ కారణంగానే బాధిత కుటుంబం కరెంట్ మీటర్పై లోడ్ పడిందనీ, ఆ అధికలోడ్ కారణంగా తొలుత విద్యుత్ మీటర్ బాక్స్ లో మంటలు చెలరేగి పక్కనే ఉన్న చెక్క షోకేస్ కు మంటలు వ్యాపించాయని అంటున్నారు. అక్కడ నుంచి మంటలు ఏసీ కంప్రెషన్ కు తాకాయనీ, దీంతోనే ప్రమాద తీవ్రత అధికమైందన్న అనుమానాలను విద్యుత్ శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా ఓవర్ లోడ్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని అంటున్నారు.