వైజాగ్ టు అమరావతి వయా హైదరాబాద్!
posted on Apr 15, 2025 5:23PM

విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రద్దుపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ, విశాఖపట్నంల మధ్య నడిచే రెండు విమాన సర్వీసులను రద్దు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. విశాఖపట్నం, విజయవాడల మధ్య ఉదయం నడిచే రెండు విమాన సర్వీసులను రద్దు చేయడం వల్ల ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆ విమాన సర్వీసులు రద్దు చేయడం వల్ల తనకు ఎదురైన ఇబ్బందిని ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో విశాఖ పట్నం నుంచి విజయవాడ వెళ్లాలంటే ముందు హైదరాబాద్ చేరుకోవలసి వస్తోందని, అక్కడ నుంచి మళ్లీ మరో ఫ్లైట్ ఎక్కి విజయవాడకు రావాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇప్పుడు విశాఖపట్నం టు అమరావతి వయా హైదరాబద్ లా పరిస్థితి మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖ-విజయవాడ నగరాల మధ్య ఉదయం నడిచే రెండు విమాన సర్వీసులు రద్దు చేయడం వల్ల తీవ్ర అసౌకర్యం కలుగుతోందని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తనకు, ఇతర ప్రయాణికులకు ఎదురైన అనుభవాలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆంధ్రాలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే తెలంగాణ మీదుగా వెళ్లాల్సి వస్తోందని తెలిపారు.
"ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి వెళ్లాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా ప్రయాణించాల్సి రావడం బాధాకరమని గంటా ఆపోస్టులో పేర్కొన్నారు. మంగళవారం (ఏప్రిల్ 15) ఉదయం తాను విశాఖ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ కు విమానంలో చేరుకుని, అక్కడ నుంచి విజయవాడ విమానం అందుకుని గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయ్యిందని చెప్పారు. ఈ మేరకు తాను ప్రయాణం చేసిన విమానం టికెట్లను కూడా ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా తనలాగే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరుకున్నారని వివరించారు. విశాఖ-విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.