దువ్వాడ ఫ్యామిలీ డ్రామా మ‌ళ్లీ మొద‌లు.. ఇంకెన్నాళ్లు స్వామి!

కుండ‌పోత వ‌ర్షానికితోడు బుడ‌మేరు వ‌ర‌ద నీరు విజ‌య‌వాడ న‌గ‌రాన్ని ముంచెత్తడంతో ప్ర‌భుత్వ యంత్రాంగం మొత్తం ముంపు ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌కు స‌హాయం అందించ‌డంలో నిమ‌గ్న‌మైంది. తెలుగు రాష్ట్రాల్లోని మీడియా మొత్తం విజ‌య‌వాడ వ‌ర‌ద‌ల‌పైనే ఫోక‌స్ పెట్టింది. గ‌త ఏడు రోజులుగా ప్ర‌తిప‌క్షం విమ‌ర్శ‌లు.. అధికార ప‌క్షం ముంపు ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న స‌హాయంపైనే ఏపీ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలోనే ఓ సిల్లీ మ్యాట‌ర్ మ‌రోసారి తెర‌ పైకి వ‌చ్చేసింది.  అదేనండీ.. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ వ్య‌వ‌హారం. దీంతో మీడియా అటెన్ష‌న్ మొత్తం అటువైపు వెళ్లిపోయింది. ఆ ఇల్లు నాదంటే.. నాదంటూ దువ్వాడ శ్రీ‌నివాస్ స‌తీమ‌ణి వాణి, ఆయ‌న స్నేహితురాలిగా చెప్పుకునే మాధురి మ‌ధ్య మ‌రోసారి యుద్ధం మొద‌లైంది. దువ్వాడ వాణి, ఆమె కుమార్తెలు, మ‌ద్ద‌తుదారులు దువ్వాడ శ్రీ‌నివాస్ ఉంటున్న ఇంటిలోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌గా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అదే స‌మ‌యంలో దివ్వెల మాధురి అదే ఇంట్లో ఉండి రెండో అంత‌స్తు పైనుంచి వీడియో తీస్తుండ‌టం చూసి వాణి, ఆమె కుమార్తెలు మ‌రింత ఆగ్ర‌హానికి లోన‌య్యారు. గ‌త ప‌ది రోజులుగా ఎలాంటి హ‌డావుడి లేక‌పోవ‌టంతో దువ్వాడ ఫ్యామిలీ వివాదం స‌ర్దుమ‌నిగింద‌ని అంద‌రూ భావించారు. కానీ, తాజా ప‌రిణామంతో వీరి మ‌ధ్య గొడ‌వ మళ్లీ తార స్థాయికి చేరింది. 


వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం దాదాపు నెల రోజులగా నడుస్తోంది. దువ్వాడ శ్రీ‌నివాస్‌, ఆయ‌న స‌తీమ‌ణి వాణిల మ‌ధ్య స‌మ‌స్య‌  ప‌రిష్క‌రించేందుకు ఇరు కుటుంబాల‌కు చెందిన పెద్ద‌లు రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా మారిన ఈ ఫ్యామిలీ పంచాయితీని సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నాలు చేశారు. అయితే, దువ్వాడ శ్రీనివాస్ ముందు వాణి ప‌లు డిమాండ్లు ఉంచ‌గా.. అన్నింటికి ఓకే చెప్పిన శ్రీ‌నివాస్‌.. వాణితో విడాకులు తీసుకునే విష‌యంలో వెన‌క్కు త‌గ్గేది లేద‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు.. శ్రీ‌నివాస్ ప్ర‌స్తుతం ఉంటున్న ఇంటిని కుటుంబ స‌భ్యుల పేరుపై రాసేందుకు అంగీక‌రించ‌లేదు. అయితే, ఇప్ప‌టికే ఆ ఇంటిలో తనకు వాటా ఉందని దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలుగా చెప్పుకునే మాధురి మీడియా సాక్షిగా చెప్పారు. మరో వైపు వాణి, ఆమె కుమార్తెలు ఆ ఇంటి విష‌యంలో వెన‌క్కు త‌గ్గేది లేద‌ని తేల్చిచెప్పారు. ఈ క్ర‌మంలో   నెల రోజుల క్రితం ఆ ఇంటిలోకి ప్ర‌వేశించేందుకు వాణి, ఆమె ఇద్ద‌రు కుమార్తెలు ప్ర‌య‌త్నించగా..  పోలీసులు అడ్డుకోవ‌టంతో ఆ ఇంటి ముందే టెంటు వేసుకొని నిర‌స‌న తెలుపుతున్నారు.

తాజాగా, దివ్వెల వాణి ఆ ఇంటిలోకి వెళ్ల‌డంతో దువ్వాడ ఫ్యామిలీ వివాదం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దువ్వాడ వాణి, ఆమె కుమార్తెలు ఇంటిలోకి ప్ర‌వేశించేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘ‌ట‌న జ‌రుగుతుండ‌గానే దివ్వెల మాధురి ఓ వీడియోను రిలీజ్ చేశారు. వివాదాస్పదంగా మారిన ఇల్లు తనదేనిని స్పష్టం చేసింది. ఈ బిల్డింగ్ తన పేరు మీదే ఉందనీ, తన ఇంట్లోకి ఎవరూ రావడానికి వీల్లేదనీ ఆమె అంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్‌తో ఏమైనా ఇష్యూ ఉంటే బయటనే తేల్చుకోవాలి. ఈ ఇల్లు తాను కొనుక్కున్నానని చెబుతూ. పోలీసులు  క్షణ కల్పించాలని కోరారు. గతంలో తాను దువ్వాడ శ్రీనివాస్‌కు రూ.2 కోట్లు అప్పుగా ఇచ్చాను. ఆ  డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే...  డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేనంటూ శ్రీనివాస్  బిల్డింగ్ రాసిచ్చాని చెప్పారు. సెల్ఫ్ ప్రాపర్టీ ఎవరు ఎవరికైనా అమ్ముకోవచ్చు అంటూ దివ్వెల మాధురి వీడియోకు వివరించింది. అంతే కాకుండా ఇటీవలే దువ్వాడ శ్రీనివాస్‌కు మరో రూ.50 లక్షలు ఇచ్చానని.. ఆయన డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని కొత్త ఇంటిని నా పేరున రాస్తానని చెప్పి శుక్రవారం ఉదయం 11 గంటలకు తన పేరున రిజిస్ట్రేషన్ చేసినట్లు కూడా దివ్వెల మాధురి వీడియోలో పేర్కొన్నారు.

మాధురి వీడియో విడుదల చేయడంతో శ్రీనివాస్ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆయన భార్య వాణి‌, కుమార్తె హైందవి ఆందోళనకు దిగారు. కోర్టులో కేసు ఉందని, ఇంట్లో ప్రవేశానికి కోర్టు తమకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. కోర్టు డైరెక్షన్ ఉండగా రిజిస్ట్రేషన్ చెల్లదని, ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని దివ్వెల మాధురికి కౌంట‌ర్ ఇచ్చారు. ప్ర‌స్తుతం దివ్వెల మాధురి నేరుగా ఇంట్లోనే మకాం వేయడంతో రానున్న రోజుల్లో దువ్వాడ ప్యామిలీ డ్రామా మరింత ముదిరే అవకాశాలు ఉన్నాయంటున్నారు.