ఆ దారుణ ఘటన కారణంగానే ఐపీఎల్ కు దూరమయ్యా.. సురేష్ రైనా క్లారిటీ
posted on Sep 1, 2020 1:26PM
దుబాయిలో జరగనున్న ఐపీఎల్- 2020 నుంచి హఠాత్తుగా తప్పుకుని చెన్నైసూపర్ కింగ్స్ సూపర్ ప్లేయర్ సురేశ్ రైనా అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసాడు. అయితే రైనా నిర్ణయం వెనుక గల కారణాలు మాత్రం స్పష్టంగా తెలియలేదు సరికదా.. అతడు హోటల్ లో ధోనికి బాల్కనీ ఉన్న రూమ్ కేటాయించి తనకు మాత్రం మాములు రూమ్ కేటాయించడంతో అలిగి వెళ్లిపోయాడని వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఈ విషయం పై సురేశ్ రైనా ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.
"పంజాబ్లోని తమ బంధువులు ఒక భయంకర ఘటనను ఎదుర్కొన్నారని ఆ ఘటనలో తన అంకుల్ని కొంత మంది నరికి చంపేశారని రైనా తెలిపారు. ఈ ఘటనలో తమ ఆంటీతో పాటు మరో ఇద్దరు కజిన్లకు తీవ్రగాయాలయ్యాయని వారంతా ప్రాణాల కోసం ఆసుపత్రిలో పోరాడుతుండగా.. దురదృష్టవశాత్తు తన కజిన్ గత రాత్రి మృతి చెందాడని. అలాగే తన ఆంటీ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది" అని సురేశ్ రైనా పేర్కొన్నాడు. అంతే కాకుండా ఈ ఘటనకు కారకులెవరో, ఆ రాత్రి అసలు ఏం జరిగిందో ఇప్పటివరకు ఎవరికీ స్పష్టంగా తెలియదని.. ఈ మొత్తం ఘటనపై దృష్టిసారించాలని అయన పంజాబ్ పోలీసులను కోరుతున్నానన్నారు. "ఈ హేయమైన చర్యకు పాల్పడిన వారు తప్పించుకుని, మరో నేరం చేయడానికి వీల్లేదు" అంటూ పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్కు సురేశ్ రైనా తాజాగా ట్వీట్ చేశారు.