కేసీఆర్, స్మితా సబర్వాల్కు కోర్టు సమన్లు
posted on Sep 6, 2024 10:57AM
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం వల్ల ప్రజా ధనానికి భారీ నష్టం వాటిల్లిందంటూ భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి జిల్లా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారించిన కోర్టు కేసీఆర్, స్మితా సబర్వాల్ కు అక్టోబర్ 17న కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.
ఈ పిటిషన్ ను విచారణలో భాగంగా గతంలోనే కోర్టు మాజీ సీఎం కేసీఆర్, మరో ఏడుగురికి నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల మేరకు మాజీ మంత్రి హరీష్ రావు తరఫున అడ్వకేట్లు కోర్టుకు హాజర య్యారు. అలాగే మెగా కృష్ణారెడ్డి, రజత్ కుమార్, ఎల్అండ్ టీ ఎండీ సురేశ్ కుమార్ తరపున సుప్రీంకోర్టు అడ్వకేట్ అవధాని, శ్రావణ్ రావు హాజరయ్యారు. ఇక ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్లు హరి రామ్, శ్రీధర్ తరపున వరంగల్ అడ్వకేట్ నరసింహా రెడ్డి హాజరయ్యారు. అయితే, మాజీ కేసీఆర్, ఐఏఎస్ అధికారణి స్మితా సబర్వాల్ కోర్టుకు హాజరు కాకపోవడం, వారి తరఫున లాయర్లు కూడా అప్పియర్ కాకపోవడంతో భూపాలపల్లి జిల్లా కోర్టు అక్టోబర్ 17న విచారణకు హాజరుకావాలని మరోసారి సమన్లు జారీ చేసింది.