పబ్లిక్ లో కాంగ్రెస్ నేత చెంప చెల్లుమంది
posted on Apr 19, 2019 11:58AM
పాటీదార్ ఉద్యమనేత, గుజరాత్ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపేయినర్ హార్దిక్ పటేల్.. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఓ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతుండగా గుర్తుతెలియని ఓ వ్యక్తి వచ్చి చెంప చెల్లుమనేలా కొట్టాడు. ఈ ఘటన గుజరాత్లోని సురేంద్రనగర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో చోటు చేసుకుంది. ఈ సభలో హార్దిక్ పటేల్ సహా రాష్ట్రంలోని పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా హార్దిక్ పటేల్ మాట్లాడుతుండగా.. ఓ వ్యక్తి ఒక్కసారిగా వేదికపైకి వచ్చి హార్దిక్ చెంపపై కొట్టాడు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు అతన్ని తీవ్రంగా కొట్టి.. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హార్ధిక్ పటేల్కు మరో చేదు అనుభవం కూడా ఎదురైంది. గుజరాత్లోని మహిసాగర్ జిల్లా లునావాడాలో ఎన్నికల ప్రచారం నిమిత్తం హార్ధిక్ పటేల్ గురువారం అహ్మదాబాద్ నుంచి హెలికాప్టర్లో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దాన్ని ఓ ప్రైవేట్ భూమిలో ల్యాండ్ చేసేందుకు లునావాడాకు చెందిన వినయ్ పటేల్ అనే వ్యక్తితో స్థానిక నేతలు ఒప్పందం చేసుకున్నారు. అయితే అది హార్ధిక్ పటేల్ వస్తున్న హెలికాప్టర్ అని తెలుసుకున్న వినయ్.. చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తన భూమిలో ల్యాండ్ చేసేందుకు ఒప్పుకోనని చెప్పారు. ‘నా అనుమతి లేకుండానే స్థానిక కాంగ్రెస్ నేత ఒకరు నా భూమిలో చాపర్ను ల్యాండ్ చేసేందుకు అధికారుల నుంచి అనుమతి తెచ్చుకున్నారు. అది హార్ధిక్ చాపర్ అని నాకు చివరి నిమిషంలో తెలిసింది. పాటిదార్ ఆందోళన సమయంలో ఎంతో మంది చనిపోయారు. వారి శవాలతో హార్ధిక్ రాజకీయం చేశాడు. అలాంటి వ్యక్తి నా భూమిలో దిగేందుకు నేను ఒప్పుకోను’ అని వినయ్ తెలిపారు. దీంతో చేసేది లేక.. హార్ధిక్ అహ్మదాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా లునావాడాకు వెళ్లారు.