కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఊహించని షాక్!!

 

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. పార్టీ మారుతున్న నేపధ్యంలో హైదరాబాద్ లోని పెద్ద అంబర్ పేట్ కళ్లెం బాల్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం ప్రారంభం కాగానే మెజారిటీ కార్యకర్తలు జై కాంగ్రెస్‌, జైజై కాంగ్రెస్‌ అంటూ నినాదాలు చేశారు. తాము కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతామని చౌటుప్పల్‌ ఎంపీపీ వెంట్‌రెడ్డి చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాంగ్రెస్‌ పార్టీకి వందేళ్ల చరిత్ర ఉందని గుర్తుచేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారాలని చూస్తున్నారని విమర్శించారు.

సమావేశంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టడంలేదని, మీరు వచ్చినా రాకపోయినా ఇబ్బంది పెట్టనని స్పష్టం చేశారు. పదవుల కోసం పార్టీ మారడంలేదని తెలిపారు. "నా కంపెనీని కేసీఆర్ భూస్ధాపితం చేశారు. నా కుటుంబసభ్యుడు అనుకున్న చిరుమర్తి లింగయ్యను టీఆర్ఎస్ చేర్పించుకున్నారు. కేసీఆర్‌ను గద్దె దించడమే నా లక్ష్యం. కేసీఆర్‌ రాష్ట్రాన్ని నియంతలాగా పాలిస్తున్నారు. నా నిర్ణయం చరిత్రను మారుస్తుంది. భట్టి విక్రమార్క కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఆత్మ విశ్వాసం కల్పించలేకపోయారు. గెలిచిన ఎమ్మెల్యేలు అమ్ముడుపోతుంటే మళ్లీ మిమ్మల్ని ఎందుకు గెలిపించాలని జనాలు అంటున్నారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చూడాలని సీఎం కేసీఆర్‌ చూస్తున్నారు. మన ఆత్మ గౌరవాన్ని కేసీఆర్‌ కాళ్ల దగ్గర పెడదమా లేక పోరాటం చేద్దామా మీరే నిర్ణయం తీసుకోండి" అని అన్నారు.