ప్రేమ వల్లే దాడులు.. జగన్రెడ్డి నీతులు.. సిగ్గు సిగ్గు..!
posted on Oct 20, 2021 2:27PM
వైసీపీ ప్రభుత్వంపై ప్రజల ప్రేమను విపక్షం జీర్ణించుకోలేక పోతోందట.. అందుకే దారుణమైన పదజాలంతో విమర్శలు చేస్తున్నారట.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అలా మాట్లాడలేదట.. టీవీల్లో బూతులు విని భరించలేని అభిమానులు అలా స్పందిస్తున్నారట.. కులాలు, మతాల మధ్య విపక్షం చిచ్చు పెడుతోందట.. కావాలనే వైషమ్యాలు రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూస్తున్నారట... ఇవీ ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడులను సమర్థిస్తూ.. ముఖ్యమంత్రి జగన్రెడ్డి నోటి నుంచి వచ్చిన సుభాషితాలు. ఇవన్నీ సిగ్గు, ఎగ్గు లేని మాటలు కాక మరేమిటంటూ జగన్ సమర్థింపుపై ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. ఇక, మంత్రులు బొత్స, అనిల్కుమార్ లాంటి వాళ్లు మరింత రెచ్చిపోయి.. బెదిరించే ప్రసంగాలు చేయడం మరింత చోద్యమంటూ అసహ్యించుకుంటున్నారు.
టీడీపీ వాళ్లు ప్రభుత్వంపై దారుణమైన పదజాలంతో విరుచుకుపడుతున్నారని జగన్రెడ్డి చెప్పడం కామెడీగా ఉందంటున్నారు. దారుణమైన పదజాలమంటే ఎట్టా ఉంటాదో మీ మంత్రులు కొడాలి నాని, అనిల్కుమార్లను అడగండి తెలుస్తుందంటూ తప్పుబడుతున్నారు. ఇక జగన్ చేసిన మరో వ్యాఖ్య.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తానెప్పుడూ అలా మాట్లాడలేదట.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ అప్పటి సీఎం చంద్రబాబును కాల్చి పారేయాలంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడాన్ని గుర్తు చేస్తూ.. మీరు, మీ మంత్రులు ఏమైనా కడిగిన ముత్యాలా? అని ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడులను సమర్థిస్తూ.. టీవీల్లో బూతులు విని భరించలేని అభిమానులు అలా స్పందిస్తున్నారంటూ జగన్రెడ్డి వెనకేసుకు రావడం దారుణమైన విషయం. మరి, అందరూ అలానే చేస్తే రాష్ట్రం రావణకాష్టం కాదా? అని మండిపడుతున్నారు. టీవీల్లో కొడాలి నాని, అనిల్కుమార్లు మాట్లాడే బూతులు విని.. టీడీపీ అభిమానులు సైతం ఇలానే స్పందిస్తే.. ఏపీలో అసలు వైసీపీ ఉంటుందా? తెలుగు తమ్ముళ్లు తలుచుకుంటే.. అధికారపార్టీ నేతలు రోడ్లపై తిరగగలరా? అని హెచ్చరిస్తున్నారు.
కులాలు, మతాల మధ్య విపక్షం చిచ్చు పెడుతోందని.. కావాలనే వైషమ్యాలు రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూస్తున్నారనేది జగన్రెడ్డి ఆరోపణ. ఇది మరీ కామెడీగా ఉందంటున్నారు. కమ్మ కులం పేరెత్తకుండా మాట్లడలేని జగన్రెడ్డి.. కులాల ప్రస్తావన చేయడం హాస్యాస్పదం అంటున్నారు. నిమ్మగడ్డ ప్రసాద్. వెంకయ్య నాయుడు, కొవాగ్జిన్ తయారీ సంస్థకు, చివరాఖరికి జస్టిస్ ఎన్వీ రమణకూ కమ్మ కులాన్ని ఆపాదించి కుల విధ్వేషాలు రెచ్చగొట్టింది ఎవరో అందరికీ తెలిసిందే. ఇక, పవన్కల్యాణ్ టార్గెట్గా కాపు పాలిటిక్స్ చేసే వైసీపీ.. ఆలయాలపై దాడులు, మతమార్పిడిలు, తిరుమల కొండపై అన్యమత ప్రచారాలు.. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఇంకెవరు చేయిస్తున్నారు? అని జనాలు ప్రశ్నిస్తున్నారు. ఇన్ని నీతిమాలిన పనులు చేస్తూ.. ఇప్పుడు నీతులు చెప్పడం.. టీడీపీపై దాడులను సమర్థిస్తూ మాట్లాడటం.. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాలరాస్తూ.. కేసులు, కుట్రలతో ప్రతిపక్షాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ.. ఏపీలో జగన్రెడ్డి అరాచక పాలన సాగిస్తూ.. ఇప్పుడిలా నీతివ్యాఖ్యలు చేయడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని అంటున్నారు.