ఏపీలో పెట్టుబడులకు వేళాయె..!

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి దేశవ్యాప్తంగా వున్న పారిశ్రామికవేత్తలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలుకుతున్నారు. గురువారం నాడు ఛండీగఢ్‌లో హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్‌ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు అతిథిలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారులకు ఏపీ స్వర్గధామం అని చెబుతూ, పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ ఆహ్వానమంటూ స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు నూతన అత్యుత్తమ పారిశ్రామిక విధానాలను అవలంబిస్తూ పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతోందని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ డూయింగ్ బిజినెస్, ఫాస్ట్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అనుసరిస్తోందని చెప్పారు. "ఆంధ్రప్రదేశ్‌లో అత్యుత్తమ వ్యాపార, పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఇంతకంటే మంచి సమయం లేదు. అభివృద్ధి ప్రయాణంలో ఏపీతో సహకరించండి. నూతన పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నాం" అని చంద్రబాబు వివరించారు.