ఆ తల్లిని కాపాడుకోవడానికి నాలాంటి కొడుకులు ఎందరో ఉన్నారు!

 

టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. మరికొందరు టీడీపీ నేతలు కూడా బీజేపీలో చేరే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ ఆకట్టుకుంటోంది.

"తెలుగుదేశం పార్టీ శ్రేణులారా... కని పెంచిన తల్లిని వదిలి వెళ్లిపోయే వాళ్ళ కోసం ఆలోచించకండి... ఆ తల్లిని కాపాడుకోవడానికి నాలాంటి కొడుకులు ఎంతో మంది ఉన్నారు .. నాకు తోడు ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు... మనది వ్యక్తి మీద ఆధార పడే పార్టీ కాదు వ్యవస్థ మీద ఆధారపడే పార్టీ, మన పార్టీ కలకాలం నిలచి ఉండేది.. ఆ మోనార్క్ లు ఓడిపోతే వాళ్ళ పార్టీలు చరిత్రలో కలిసి పోతాయి.. మనకు ఎంతో మంది ముఖ విలువ గల నాయకులు ఉన్నారు... ఇంకా 58 నెలలే మన కష్టాలు." అని కార్యకర్తలకు భరోసా ఇస్తూ పోస్ట్ పెట్టారు.

మరో పోస్ట్ లో.. "తెలుగు నేల, తెలుగు జాతి, తెలుగు భాష ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఉంటుంది... టీడీపీ వ్యక్తుల పేరు మీదో, ప్రాంతాల పేరుతోనో, సెంటిమెంట్ ని నమ్ముకునో పెట్టలేదు... తెలుగోడి ఆత్మాభిమానాన్ని నమ్ముకుని పెట్టింది" అని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.