జగన్ బెయిల్ రద్దు కేసు అప్ డేట్.. సీబీఐ కోర్టులో ఏం జరిగిందంటే...
posted on Jun 14, 2021 12:38PM
అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్పై ఇప్పటికే జగన్ తరఫు న్యాయవాదులు, సీబీఐ కౌంటర్ దాఖలు చేశాయి. రఘురామ పిటిషన్ను కొట్టేయాలని సీబీఐ తరపు న్యాయవాదులు కౌంటర్ వేయగా... చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీబీఐ కోరింది. వారిద్దరి కౌంటర్ పిటిషన్లపై సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు రిజాయిండర్ దాఖలు చేశారు.
జగన్ బెయిల్ రద్దు పిటిషన్ అనేది పిటిషన్ అర్హత సాధించిన తరువాతనే కోర్టు విచారణకు స్వీకరించిందని రఘురామ తరఫు న్యాయవాది అన్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో చాలా మంది అధికారులు సాక్షులుగా, నిందితులు ఉన్నారన్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో వారు మంచి స్థాయిలో ఉన్నారని, దీంతో అధికారులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు, నియామకాలు చీఫ్ సెక్రెటరీ చూడాల్సి ఉంటుందని... కానీ ఏపీలో ఒక కొత్త జీవో తీసుకొచ్చి ఐఏఎస్ , ఐపీఎస్లను ముఖ్యమంత్రే స్వయంగా నియమించేలా జీవో తెచ్చారన్నారు. దీంతో అక్కడ అధికారులను ఎదో రకంగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్నారు. రఘురామ కృష్ణంరాజుపై 8 కేసులు ఉన్నాయని, ఒకటి సీబీఐ, ఏపీలో 7 కేసులు ఉన్నాయన్నారు. ఒక్క కంప్లైట్లో మూడు కేసులు చేర్చారన్నారు. రాఘురామ రాజకీయంగా, వ్యక్తిగతంగా లబ్ది పొందడానికి పిటిషన్ వేయలేదన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తిపై 11 ఛార్జ్ షీట్లు ఉన్నాయని, కాబట్టి ఈ దేశ పౌరుడిగా ఆ కేసులుపై విచారణ చేయాలని కోరే అర్హత రఘురామకు ఉందన్నారు. సాక్షులను ప్రభావితం కాకుండా చూడాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారులపై ఉందని రఘురామ తరఫు న్యాయవాది రిజాయిండర్లో పేర్కొన్నారు.
తన కౌంటర్లో జగన్ అసత్యపు ఆరోపణలు చేశారని తెలిపారు రఘురామ రాజు. తనకు పిటిషన్ వేసే అర్హత లేదనడం అసంబద్ధమని తెలిపారు. జగన్ ఆరోపణలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని చెప్పారు. రఘురామ రిజాయిండర్ పై వాదనలకు సమయం ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో జులై 1కి విచారణను వాయిదా వేస్తున్నట్లు సీబీఐ కోర్టు ప్రకటించింది.