మరో పరువుహత్య?

 

మిర్యాలగూడలో ప్రణయ్ హత్య.. హైదరాబాద్లో మాధవిపై దాడి మరువకముందే మరో పరువుహత్య జరిగింది. ప్రేమను తుంచలేక పరువు పేరుతో నిండు ప్రాణాలు బలితీసుకుంటున్నారు. తాజాగా కరీంనగర్‌ జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. తాడికల్‌కు చెందిన గడ్డి కుమార్‌ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. తాడికల్‌ శివారులోని వంకాయగూడెం గ్రామం వద్ద ఓ పొలంలో మంగళవారం ఉదయం అతడి మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. కుమార్‌కు అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే విషయం తెలిసిన యువతి కుటుంబసభ్యులు కుమార్‌ను బెదిరించినట్లు తెలుస్తోంది. యువతిని మర్చిపోవాలని లేదంటూ చంపేస్తామని యువకుడిని చాలా సార్లు హెచ్చరించారు. అయినప్పటికీ యువతితో కుమార్ ప్రేమను కొనసాగించాడు. ఈ క్రమంలో కుమార్ శవమై కనిపించాడు. దీంతో యువతి బంధువులే కుమార్‌ను చంపేశారని ఇది ఖచ్చితంగా పరువు హత్యే అని యువకుడి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న శంకరపట్నం పోలీసులను గ్రామస్థులు అడ్డుకున్నారు. పోలీసు వాహనంపై దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ కరీంనగర్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో ఈ మార్గంలో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.