అంబటి అజ్ణాన ప్రదర్శనలో మేటి!
posted on Jul 1, 2024 12:26PM
మాజీ మంత్రి అంబటి రాంబాబు తన అజ్ణాన ప్రదర్శనకు తహతహలాడిపోతున్నారు. తాను మంత్రిగా ఉండి పాడుబెట్టిన పోలవరం ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కిస్తూ చంద్రబాబు ప్రజలలో తన గ్రాఫ్ ను అమాంతం పెంచేసుకుంటుంటే.. ఓర్వలేని తనంతో, దుగ్ధతో ఆయన తన అజ్ణాన ప్రదర్శనకు మెరుగులు పెట్టి మరీ నవ్వుల పాలౌతున్నారు. పోలవరం చాలా కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్. అది ఎవరికీ అర్ధం కాదు. ఎందుకంటే నాకూ అర్ధం కాలేదు కనుక అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహించని అంబటి తాజాగా జగన్ హయాంలో పోలవరం పనులు బ్రహ్మాండంగా చేశాం. అయితే అంతకు ముందు చంద్రబాబు నిర్వాకం వల్లే తమ పనులు ఫలితం లేకుండా పోయాయి. అందుకే ప్రస్తుతం పోలవరం పరిస్థితికి వందకు వంద శాతం చంద్రబాబే కారణమంటూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో మీడియా ముందుకు వచ్చారు.
తన మాటల్లోని డొల్ల తనం ఏమిటో అంబటికి తప్ప అందరికీ బాగానే అర్ధమౌతాయి. తన వైఫల్యాలను ఎదుటివారిపైకి నెట్టడానికి ఆయన హేతువును పూర్తిగా విస్మరించేస్తారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి జగన్ అస్తవ్యస్తంగా మార్చేశారు. 70శాతానికి పైగా పూర్తి అయిన ప్రాజెక్టును జగన్ తన అహంకారంతో, అవగాహనా రాహిత్యంతో రివర్స్ టెండరింగ్ అంటూ తల్లకిందులు ఆలోచనలతో చిందరవందర చేశారు. 2014 నుంచి 2019 వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులను పరులెత్తించారు. అయితే 2019 ఎన్నికలలో విజయం సాధించిన జగన్ తన చాతగాని తనంతో ప్రాజెక్టు పనుల పురోగతి ఎలా? అనిపించేలా గందరగోళం చేసి పారేశారు. విధ్వంసం వినా మరోటి తెలియని జగన్ పోలవరాన్ని ప్రశ్నార్ధకంగా మార్చేశారు. అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం విజయం సాధించి చంద్రబాబు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే పోలవరం పురోగతికే అగ్రతాంబూలమిచ్చారు.
పోవలరం సందర్శన, పరిశీలన జరిగిన వెంటనే జరిగిన నష్టాన్ని అంచనా వేసి, ఈ ప్రాజెక్టుని త్వరగా పూర్తిచేసేందుకు తగిన సూచనలు, సలహాలతో నివేదిక ఇచ్చేందుకు అమెరికా, కెనడా దేశాలకు చెందిన నలుగురు ఇరిగేషన్ నిపుణులను రప్పించారు. వారు జూలై 3 వరకు పోలవరం ప్రాజెక్టు అంతా పర్యటించి, అధికారులు, కాంట్రాక్ట్ కంపెనీలతో సమావేశమయ్యి చర్చిలు జరిపి ఒక నివేదిక ఇచ్చే పనిలో నిమగ్నమైపోయారు. అలాగే పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేశారు.
దీంతో తాము అధికారంలో ఉండగా పోలవరంపై అవగాహనా రాహిత్యంతో పాడుపెట్టేశామన్న విమర్శలకు బదులివ్వకుంటే ఎలా అనుకున్నారో ఏమో మాజీ మంత్రి అంబటి రాంబాబు తన అజ్ణానాన్నంతా రంగరించి మరీ మేం పోలవరం కోసం బ్రహ్మాండంగా పని చేశాం అంటూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేశారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు వలనే పోలవరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి దాపురించిందని చెప్పారు. అంత పెద్ద జాతీయ ప్రాజెక్టుని కూడా భ్రష్టు పట్టించేసి మళ్ళీ నిసిగ్గుగా చంద్రబాబు నాయుడుని విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి అవగాహన లేక పోలవరం ప్రాజెక్టుకి నష్టం కలిగించారని జగన్, అంబటి రాంబాబు భావిస్తున్నట్లయితే, వాటిని సరిదిద్ది పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఉండాలి కదా? గత ఐదేళ్లూ అధకారంలో ఉన్నది వారే కదా? కనీసం ఈ లాజిక్ ను కూడా మర్చిపోయి అంబటి తన అజ్ణాన ప్రదర్శనకు తానే చప్పట్లు కొట్టేసుకుంటున్నారు. పైగా పోలవరం చాలా కాంప్లికేటెడ్. అది ఎవరికీ అర్ధం కాదు, ఎందుకంటే నాకు అర్ధం కాలేదుఅంటూ తనకు తానే మేధావిగా కితాబులిచ్చేసుకుంటున్నారు. అంబటి అజ్ణాప ప్రదర్శనపై నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.