నకిలీ విత్తనాల సమస్య నుంచి రైతులను రక్షించేలా...
posted on Jul 6, 2020 6:33PM
రైతులకు మేలు చేసే గ్రామ విత్తనోత్పత్తి పథకం
సోషల్ మీడియా ద్వారా అవగాహన
నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. దీనికి గ్రామ విత్తనోత్పత్తి పథకంగా పేరు పెట్టారు.
రాష్ట్రంలో ఈ సంవత్సరం పెద్ద ఎత్తున సీడ్ ఫాం లలో పండించిన విత్తనాన్ని ఈ గ్రామ విత్తనోత్పత్తి పథకం ద్వారా రైతులకు ఇచ్చి , వాటిని పండించి అధికారుల సమక్షంలో ధృవీకరించి, టి.ఎస్.ఎస్.డి.సి ద్వారా కొనుగోలు చేసి, మళ్ళీ రైతులకు పంపిణీ చేస్తారు. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా చేసే ప్రక్రియలో భాగంగా విత్తనోత్పత్తి పథకం అమలు చేస్తున్నారు.
ఇలా చేయడం వల్ల నకిలీ విత్తనాల సమస్య నుంచి రైతులను రక్షించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో రైతులకు, వ్యవసాయ అధికారులకు అవగాహన కల్పించడానికి వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ బి.జనార్దన రెడ్డి, ఐ ఎ ఎస్ ఈ నెల 7న మధ్యాన్నం 12.30 గంటలకు నిరుపమా చానెల్ యూ ట్యూబ్, టి శాట్ టి వి, టి శాట్ యాప్, ఫెస్బుక్, ట్విట్టర్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడతారు. వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న గ్రామ విత్తనోత్పత్తి పథకం గురించి ఆయన వివరిస్తారు. రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ క్షేత్ర స్థాయి విస్తరణ అధికారులు, సీడ్ కార్పోరేషన్ అధికారులు, సీడ్ సర్టిఫికేషన్ అధికారులకు అవగాహన కల్పించేందుకు ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహిస్తున్నారు.
రైతులు, ఇతరులు సంప్రదించవలసిన నెంబర్లు: T.SAT Toll Free Nos.18004254039, 040-23553473