పండుగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
posted on Jan 12, 2026 8:36PM

సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం సాయంత్రం అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. 2023, జులై 1వ తేదీ నుంచి ఈ డీఏ అమలు చేయాలని జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 2026 జనవరి మాసంలో తీసుకునే జీతంతో కలిపి ఈ డీఏ చెల్లించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో వివరించింది. జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఉద్యోగులకు సైతం ఈ డీఏను వర్తింప చేయనున్నారు.
యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కు కూడా ఈ డీఏ కింద నిధులు చెల్లించనున్నారు. 30.03 శాతం నుంచి 33.67 శాతానికి ఈ డీఏను ప్రభుత్వం సవరించిన విషయం విదితమే. గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పులు భారాన్ని మాపై మోపి వెళ్లినా, ఉద్యోగులకు మొదటి తారీఖు నాడే జీతాలు ఇస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఈ ప్రభుత్వం సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తోంది. సంక్రాంతి కానుకగా డీఎ ఫైల్ పై సంతకం చేసి డైరీ ఆవిష్కరణకు వచ్చామని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 డైరీ& క్యాలెండర్ను ఆవిష్కరణ సందర్బంగా సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు.
ప్రభుత్వాన్ని నడిపేది కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు. ప్రతి ప్రభుత్వం ఉద్యోగీ ఇందులో భాగస్వామ సీఎం స్ఫష్టం చేశారు. మీరే మా సారధులు, మా వారధులు. మీ సోదరుడిగా మీకు అండగా ఉంటా. ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో పూర్తిస్థాయిలో భరోసా ఇచ్చే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రమాద బీమా కోటి రూపాయలు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.