Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 12


 

    జనార్దనం ఆఫీసులో వుండగా అతనికి ఫోన్ కాల్ వచ్చింది. అతను చాలా ఆశ్చర్య పడ్డాడు. ఫోన్ చేసింది అతని మావగారు అర్జంటుగా ఏదో మాట్లాడాలనీ , అప్సరా హోటల్లో పదకొండో నంబరు గదిలో సాయంత్రం తనని కలుసుకోవాలసిందని శంకర్రావు గారు ఫోన్ చేశాడు. తను వచ్చిన విషయం సీతకు చెప్పవద్దన్నాడు.
    మావగారికి తనతో మాట్లాడవలసొచ్చిన అర్జంటు విషయమేమిటో అర్ధం కాక చాలాసేపు మధనపడ్డాడు జనార్దనం. ఆయనకు తనంటే ద్వేష భావం తప్ప మరేమీ లేదు. తన చావుకోరే వ్యక్తీ అయన. అయన వద్ద నమ్మిన బంటుగా , చేదోడు వాదోడుగా ఉంటున్న వెంకటరమణ అంటే ఆయనకు ఎంతిష్టముంటే , అతన్ని యింటల్లుడిగా చేసుకోవలనుకుంటూన్నారాయన. వెంకట రమణ ఆయనకేదో దూరపువరుసలో బందువవుతాడు. చిన్నప్పట్నించి మావయ్యా అని పిలుస్తూ , ఆయననింట్లో నే పెరిగి పెద్దవాడయ్యాడు. శంకర్రావు గారిచ్చిన చనువును పురక్సరించుకుని ఆతను సీతమీద చాలా ఆశలు పెంచుకున్నాడు. కానీ, విధి మరోలా తలచింది. సీత తనని ప్రేమించింది!
    వెంకటరమణ ఇంకా పెళ్ళి చేసుకోలేదు. తను చస్తాడనో, లేక సీత తనకు విడాకులిస్తుందనో అతనికింకా ఆశ వున్నట్లుంది, బహుశా, ఆ ఆశను శంకరరావు గారే కల్పించి వుంటారని సీత అంటుంది.
    శంకర్రావుగారు తనతో ఇప్పుడర్జంటూగా మాట్లాడవలసిన దేమిటో!
    సాయంత్రం ఆఫీసు నుంచి వెళ్ళేటప్పుడు జనార్దనం అప్సరా హోటల్ కు వెళ్ళి శంకర్రావుగారిని కలుసుకున్నారు. అతననుకున్నట్లు శంకర్రావు గారు ద్వేషభావాన్ని ప్రదర్శించలేదు. మొట్టమొదటిసారిగా అయన అల్లుడితో ఆప్యాయంగా మాట్లాడేరు.
    "మొదట్లో తప్పుగా అర్ధం చేసుకున్నాను కానీ, నువ్వు చాలా యోగ్యుడివి. సీత కాపురం - హాయిగా నడుస్తోందని తెలుసుకున్నారు. ఎటొచ్చీ నాకు ఒక్కటే బాధగా వుంది. సీత నాకోక్కగానొక్క బిడ్డ. దాన్ని నేను కంటికి రెప్పలా పెంచాను. కష్టమంటే తెలియకుండా చూసుకున్నాను. ఈనాడది సామాన్యమైన జీవితం గడుపుతుంటే చూస్తూ ఊరుకోలేకున్నాను."
    'సీత జీవితం ఇప్పుడు సామాన్యంగా ఏమీ లేదు..." అన్నాడు జనార్దనం పౌరుషంగా.
    వెంకట్రావుగారు నాలిక్కరుచుకుని , "నా అభిప్రాయమది కాదు. నిన్ను చిన్నబుచ్చాలన్నది నా అభిమతం కాదు. నేను చెప్పేది విని నువ్వే ఆలోచించు. నేను కొటీశ్వరురుడిని నువ్వో సామాన్య ఉద్యోగస్తుడివి. నా స్థాయికి నువ్వెన్నడూ చేరుకోలేవు. నాకులా సీతను చూసుకోనూ లేవు" అన్నాడు.
    జనర్ధనానికి కోపం వచ్చిందన్న విషయం ఎర్రబడ్డ అతని ముఖమే చెబుతోంది.
    "అలాగని నువ్వు సీతకు తక్కువ చేస్తున్నావని - నేనడం లేదు. వివాహమైపోయినంత మాత్రాన తండ్రి గారి బాధ్యతలు తొలగిపోతాయని నేననుకోవడం లేదు. కానీ, నా పేరు చెబితేనే మండి పోతోంది సీత. అది నా దురదృష్టం . నువ్వు నాకు చేయగలిగిన సహాయమేమిటంటే నేను నీకో కారు కొనిస్తాను. బ్యాంకులో నీ పేరున రెండు లక్షలు వేస్తాను. ఈ రెండు నావల్ల జరిగినట్లు సీతకు తెలియనివ్వకు. సీతను మాత్రం దర్జాగా చూసుకో. దాన్ని కారులో తప్ప తిప్పవద్దు" అన్నాడు శంకర్రావు.
    జనార్దనం ఉలిక్కిపడ్డాడు. మామగారి అభిప్రాయ ఇది అని అతని కింతవరకూ తెలియలేదు. వెంటనే ఏం అనాలో, ఏం మాట్లాడాలో తోచక అతను మౌనం వహించాడు.
    "కోటీశ్వరుడి ఏకైక పుత్రికకు భర్తవు నువ్వు. ఆ దృష్ట్యా చూస్తె నీకు రెండు లక్షల లివ్వడం నువ్వు అవమానంగా భావిస్తున్నా వనుకుంటాను. నన్ను పూర్తిగా అర్ధం చేసుకుంటే అలాగనుకోవు. నేను అమ్మాయి పేరున పది లక్షల రూపాయలకు షేర్లు కొన్నాను. అవి కూడా నీకే ఇస్తున్నాను. భద్రంగా దాచి ఉంచు. ఆమె అర్ధంతరంగా మరణించిన పక్షంలో అవి నీ పేరున మారతాయి. సీత పెళ్ళికి ముందే ఈ షేర్లున్నాయి. ఆ సంగతీ దానికీ తెలుసును. కానీ, నేనిస్తే అది తీసుకోదు. నువ్వు కూడా ఈ వివరాలు వెంటనే చెప్పవద్దు. దాని మనసు పనిపెట్టి మంచి సమయం చూసి చెప్పు " అంటూ అయన అతనికి ఆన్ని కాగితాలందించాడు.
    జనార్ధనానికి చాలా వింతగా వుంది. అతనా కాగితాలను పరేక్షించి చూశాడు. పేరు పొందిన రకరకాల కంపెనీలలో సీత పేరున షేర్లున్నాయి. అవన్నీ ఆమెకు కాబోయే భర్తకు చెందుతాయి. ఆ భర్త అర్ధాంతరంగా మరణించిన పక్షంలో అవి శంకరరావుకు చెందుతాయి.  వాటిలో వీలునామా ఒకటి వుంది. అది శంకరరావు ఆస్తిపాస్తులను సీతకు చెందవలసిన వాటి వివరాలనిస్తూ వ్రాయబడింది. సీత మరణించిన పక్షంలో ఆ ఆస్తి ఆమె భర్తకు చెందాలని వ్రాయబడి వుంది. అవికాక శంకర్రావు జనార్ధనానికి రెండు లక్షలు క్యాషు కూడా యిచ్చి, "రేపు నీ ఆఫీసుకి కొత్త కారు వస్తుంది. అది నీదే!" అన్నాడు.
    "ఇదంతా మీరెందుకు చేస్తున్నారో నాకర్ధం కావడం లేదు " అన్నాడు జనార్దనం.
    'అర్ధం కావడాని కేముంది? నీ మూలంగా నాకూతురు నాక్కాకుండాపోయింది. నీ కారణంగా నేను దానికి శత్రువునైపోయాను. మళ్ళీ దాన్ని నా ఇంట మనిషిగా చేయాలన్నది నా కోరిక. అది నీ మూలంగానే సాధించాలన్నది నా కోరిక. సాధించగలనన్నది నా ఆశ!" అన్నాడు శంకరరావు.
    జనార్ధనానికి మామగారి బాధ అర్ధమైంది. ఆ పితృ హృదయం పడుతున్న వేదనను గుర్తించే డబ్బు శంకర్రావు సహృదయతా, సద్భుద్దీ అతన్ని అన్ని సంఘటనలు మరిచి పోయేలా చేశాయి. ఎలాగో అలా ప్రయత్నించి సీత మనసు మార్చాలని గట్టిగా అనుకుని అక్కణ్ణించి బయటపడ్డా డతను.
    ఇంటికి వెళ్ళేసరికి సీత ఒక్కర్తీ ఇంట్లో వుంది. హంతకుడు లేడు. అతను నెమ్మదిగా భార్య వద్ద మామగారి ప్రసక్తి తీసుకువచ్చి, "జన్మ నిచ్చిన తండ్రి పూజ్యనీయఅయిన న్నసహ్యించుకోవడం  చాలా తప్పని నాకు తోస్తోంది " అన్నాడు.
    సీత నవ్వి , "మా నాన్నగారంటే నాకు చాలా గౌరవముంది. ఆయన్నసహ్యించుకోవడం పాపంగా బావిస్తున్నాన్నేను " అంది.
    "కానీ, మరి.....' జనార్దనం తడబడ్డాడు.
    'చూడండి - దేవుడంటే భక్తీ వుంది నాకు. ఆ భక్తీ కారణంగా నేను యితరుల కన్యాయం చేయకూడ దనుకుంటాను. నా దైవభక్తి నన్ను మంచిదాన్ని చేయాలి. నాచే పదిమందికి మంచి చేయించాలి. అంతేకానీ - ఇంట్లోనూ, గుడిలోనూ , పలువురి ఎదుట పూవులతో పూజించడమూ, లెక్కకు మించిన స్వార్ధంతో కోర్కెలు కోరడమూ  దైవభక్తి అని నేననుకోవడం లేదు ."
    సీత తన అభిప్రాయాలను చాలా ఖచ్చితంగా చెప్పడంతో జనార్దనం చాలా ఇరుకున పడ్డాడు. ఆమె మనసులో తండ్రికి విలువ ఉంది. కానీ, అందుకాయన దగ్గర్నుంచి ప్రతిఫలాన్నేమీ ఆశించడం లేదామే. ప్రతుఫలాపెక్షతో మనిషిని గౌరవించడం సీత కిష్టముండదు. తను శంకరరావు గారి మీద గౌరవం పెంచుకున్నాడంటే అది ప్రతిఫలాపేక్షతోనే! రెండు లక్షల రూపాయల నయాచితంగా వదులుకోవడం అతనికే మాత్రమూ యిష్టం లేదు.
    కాస్సేపాగి అతను తెగించి బ్రీఫ్ కేసు తెరిచి డబ్బు కాగితాలు అన్ని చూపించి, శంకర్రావు గారి ఔదార్యాన్ని కొనియాడాడు. అతని మాటలు వింటూ దెబ్బతిన్నట్లు కనపడింది సీత.
    "మీరు మా నాన్నగారిని పొగుడుతున్నారా ?" అందామె ఆశ్చర్యంగా. "అయన ఒకనాడు మిమ్మల్ని పురుగు కన్న హీనం చేసి మాట్లాడారు. ఆ మాటలు తలచుకుంటుంటే ఇప్పటికీ నా శరీరం ఉడికిపోతోంది..."
    "ఆవేశం మానవ సహజం. తన కూతురు తనక్కాకుండా పోతోందన్న ఆవేదన అయన కావేశాన్ని కలిగించి యుక్తా యుక్త విచక్షణాజ్ఞానాన్ని నశింప జేసింది. అప్పుడు మనమూ ఉద్రేక పడ్డాం. కాలం గడిచింది. ఆవేశం నశించి ఆ స్థానంలో మమకారం మళ్ళీ తలెత్తుతోంది. దాన్ని మనం అణచివేయకూడదు...."
    సీత జనార్ధనాన్ని పరేక్షగా చూసి , "మీకు డబ్బు మీద మోజు కలిగింది , ఎందుకో చెప్పండి !' అంది.
    "ఎందుకా?" బాధగా నవ్వాడు జనార్దనం. "నువ్వెలా పెరిగావో, ఎలా బ్రతికావో తెలిసినవాణ్ని , కేవలం నా కారణంగా నీ స్థితి దిగజారిపోయిందని తెలిసినవాణ్ని. నిన్ను మళ్ళీ పూర్వపు స్థాయికి తీసుకురావడం నావల్ల కాదని తెలిసినవాణ్ణి. అనుక్షణం నేనంత నరకాన్ననుభావిస్తున్నానో నీకు తెలియదు సీతా!"
    "ఎందుకండీ -- నాకు లేని బాధ !" అంది సీత.
    'అవును - బాధ నీకెందుకుంటుంది ? త్యాగమూర్తి గా నీకేలాగూ పేరు వచ్చింది. నా మూలంగానే కదా నువ్వీ త్యాగం చేశావు? నీ త్యాగం నన్ను ప్రతినిత్యం దహించి వేస్తోంది!" అన్నాడు జనార్దనం.
    'అంత పెద్ద మాటలు వాడకండి. మీరెంత బాధ పడుతున్నట్లు నాకు తెలియదు. మా నాన్నగారి మనసు మారి, మీరు అయన పట్ల మోజుగా వుంటే, అందరికీ అంగీకారంగా వుండే ఒప్పందం రేపు కుదురుస్తాను. మీరేమీ బాధపడకండి !" అంది సీత, "ఎటొచ్చీ ఆ షేర్ల కాగితాలు , ఆ డబ్బూ అన్నీ మీరు తక్షణం అయన కిచ్చేసిరండి. రేపు నేనే ఆయన్ను కలుసుకుని మాట్లాడుతానని చెప్పండి."




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.