శనివారం రోజు హనుమాన్ చాలీసాను 7సార్లు పఠిస్తే జరిగే అద్బుతం ఇదే!

హిందూ పురాణాలు, నమ్మకాల ప్రకారం హనుమంతుడు అన్ని యుగాలలో ఉంటాడు. అంటే.. నేటి కలియుగంలో కూడా హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుడిని సరైన విధంగా.. ధర్మంగా, న్యాయంగా ఉంటూ ఆరాధిస్తే.. రక్షణగా నిలుస్తాడు. భారతదేశంలో హనుమంతుడి గురించి, హనుమాన్ చాలీసా గురించి తెలియని వారు అస్సలు ఉండరు అని చెప్పవచ్చు. హనుమంతుడి శక్తిని, హనుమ అనుగ్రాన్ని పొందే గొప్ప మార్గం హనుమాన్ చాలీసా పఠనం. హనుమాన్ చాలీసాను పఠిస్తే.. హనుమంతుడి రక్షణ మాత్రమే కాకుండా.. శ్రీరాముడి కృప కటాక్షాలు కూడా లభిస్తాయి. ఏ దేవుడు అయినా.. తనను పూజించడం కంటే.. తన భక్తులను పూజించి, స్తుతిస్తే చాలా తొందరగా అనుగ్రహిస్తారు. కాబట్టి హనుమంతుడి హనుమాన్ చాలీసా పఠిస్తే శ్రీరాముడి అనుగ్రహం, హనుమంతుడి అనుగ్రహం కూడా లభిస్తాయి. ముఖ్యంగా హనుమాన్ చాలీసాను మంగళవారం, శనివారాలలో ఎక్కువగా పఠిస్తూ ఉంటారు. శనివారం రోజు హనుమాన్ చాలీసాను 7 సార్లు పఠించడం వల్ల అద్బుతమైన ఫలితాలు లభిస్తాయని చెబుతారు. శనివారం హనుమాన్ చాలీసాను 7 సార్లు పఠించడంలో పాటించవలసిన నియమాలు ఏంటి? శనివారం హనుమాన్ చాలీసా పఠిస్తే జరిగే అద్భుతాలు ఏంటి? తెలుసుకుంటే..
శని దేవుడి వాగ్ధానం..
శనివారం రోజు హనుమంతుడిని ఆరాధించేవారి మీద శనిదేవుడి ప్రభావం ఉండదని స్వయానా శనిదేవుడే హనుమంతుడికి వాగ్దానం చేశాడు. హనుమంతుడిని పూజించే వారి మీద శనిదేవుడి దృష్టి కూడా పడదని అంటారు.
సప్త పారయణ..
శనివారం నాడు హనుమాన్ చాలీసాను ఏడుసార్లు పఠించడం చాలా శక్తివంతమైన ప్రక్రియగా పరిగణించబడుతుంది. అయితే సరైన పద్ధతిలో చేసినప్పుడు మాత్రమే పూర్తీ ప్రయోజనాలు లభిస్తాయి.
హనుమాన్ చాలీసాలో ఒక దోహా ఉంటుంది.
"జో శతవార పాఠకర కోయి
చుటహీ బంధి మహా సుఖ హోయి" అని ఒక దోహ ఉంటుంది.
హనుమాన్ చాలీసాను ఒకే ఆసనం మీద కూర్చుని వంద సార్లు పారయణ చేస్తే ఎలాంటి కష్టాలు అయినా తొలగిపోతాయట. అయితే వంద సార్లు పారాయణ చేయలేని వారు ఏడు సార్లు పారాయణ చేయవచ్చట. ముఖ్యంగా శనివారం రోజుల్లో హనుమాన్ చాలీసాను ఏడు సార్లు పఠించడం వల్ల శని దేవుడి ప్రభావాలు అయిన ఏలినాటి శని, శని మహాదశ, శని అర్దాష్టమ దశ, సాడే సతి వంటి ప్రభావాలు అన్నీ తగ్గుతాయి.
శనివారం హనుమాన్ చాలీసా పారాయణ నియమాలు..
శనివారాల్లో, సూర్యోదయ సమయంలో గానీ లేదా సూర్యాస్తమయం తర్వాత గానీ హనుమాన్ చాలీసా పఠించాలి. శని దోషాన్ని శాంతింపజేయడానికి సాయంత్రం పూట పఠించడం చాలా మంచిది.
హునుమాన్ చాలీసా పారాయణ కోసం ఎరుపు రంగు ఆసనం ఏర్పాటు చేసుకోవాలి. పఠనం సమయంలో ముఖం తూర్పు లేదా దక్షిణం వైపు ఉండాలి.
పారాయణం ప్రారంభించే ముందు, మల్లె నూనెతో దీపం వెలిగించాలి. ఒకవేళ మల్లె నూనె అందుబాటులో లేకపోతే, స్వచ్ఛమైన నెయ్యి లేదా ఆవ నూనెతో కూడా దీపం వెలిగించవచ్చు.
పారాయణ ప్రారంభించే ముందు, చేతిలో నీళ్ళు తీసుకుని, 7 సార్లు పఠిస్తానని సంకల్పం చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పారాయణ చేసే రోజుల్లో బ్రహ్మచర్యం పాటించాలి. కనీసం మనసులో కూడా ఎలాంటి తప్పుడు ఆలోచనలు రానివ్వకూడదు.
హనుమంతునికి బెల్లం, వడపప్పు లేదా బూందీ లడ్డూలు, మినప వడ మాల వంటివి సమర్పించడం చాలా మంచిది. ముఖ్యంగా తమలపాకుల మాల సమర్పించినా చాలా మంచిది.
చివరగా, భక్తిశ్రద్ధలతో హారతి ఇవ్వాలి. పారాయణం పూర్తయిన తర్వాత, ప్రసాదాన్ని స్వీకరించి, ఇతరులకు కూడా పంచాలి.
*రూపశ్రీ.


