వైసీపీ ఎమ్మెల్యే తమ్ముడే టీడీపీలోకి...!
posted on Sep 12, 2017 12:52PM
నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. దీంతో వైసీపీ నుండి పలువురు నేతలు టీడీపీలోకి జంప్ అవ్వడానికి చూస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ వైసీపీ ఎమ్మెల్యే సోదరుడే తన పొలిటికల్ ఫ్యూచర్ కోసం టీడీపీలోకి జంప్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు... ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి. మధుసూదన్ రెడ్డి ఇప్పటి వరకు ఉరవకొండ రాజకీయాల్లో అన్న తరపున చాలా క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. అయితే గత కొద్ది కాలంగా మధుసూదన్ రెడ్డి కుటుంబంలో రాజకీయ విబేధాలు తలెత్తుతున్నాయి. దీంతో కుటుంబంలో ఆయన ప్రాధాన్యత తగ్గిందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ కారణంగా..మధుసూదన్రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీలో చేరాలని భావించినట్టు తెలిసింది. అంతేకాదు కొందరు టీడీపీ నేతలు మధుసూదన్రెడ్డి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది.