మరో వివాదంలో కూన రవి.. లేపేస్తానంటూ వైసీపీ నేతకు ఫోన్ లో వార్నింగ్
posted on Jun 27, 2020 5:10PM
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవి కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తేడా వస్తే లేపేస్తా అంటూ వైసీపీ నేతను ఆయన ఫోన్ లో బెదిరించిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత స్థానిక నేత గుడ్ల మోహన్ రావు వైసీపీ లో చేరారు. అయితే, ఆయన బిల్డింగ్లోనే పొందూరు టీడీపీ కార్యాలయం ఉంది. టీడీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించాలని గుడ్ల మోహన్కు వైసీపీ నుంచి ఒత్తిళ్లు ఉండడంతో.. ఖాళీ చేయాల్సిందిగా కూన రవి కుమార్ ను కోరారు. దీంతో.. నేను ఖాళీ చేయను ఏం చేసుకుంటావో చేస్కోమని కూన సమాధానం చెప్పారు. అయితే.. తన గురించి ఆలోచించాలని కోరిన మోహన్.. నా బిల్డింగ్ మాత్రం ఖాళీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో, ఆగ్రహంతో ఊగిపోయిన కూన.. నీగురించి ఆలోచించేది ఏంటి? తేడా వస్తే లేపేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అయితే, తనపై వస్తున్న ఆరోపణలను కూన రవికుమార్ ఖండించారు. పొందూరులో ఉన్నది జాయింట్ ప్రాపర్టీ అని వివరణ ఇచ్చిన కూన.. టీడీపీ ఆఫీసు బిల్డింగ్పై ఇద్దరికీ హక్కు ఉందని స్పష్టం చేశారు. నాకు చెప్పకుండా ఆఫీసు రంగులను ఎలా మారుస్తారు? అని ప్రశ్నించిన ఆయన.. మర్యాదతక్కువ పనులు చేయొద్దని మాత్రమే చెప్పానని అన్నారు.
కాగా, ఇటీవల కూన రవి కుమార్ ఓ ఎమ్మార్వోను ఫోన్ లో దూషించిన ఆడియో క్లిప్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆయనపై కేసు కూడా నమోదైంది. ఇలా వరుసగా ఆయన ఫోన్ లో వార్నింగ్ లు ఇస్తున్న ఆడియో క్లిప్ లు బయటకు రావడం చర్చనీయాంశమైంది.