భారత సైన్యం.. మరో సర్జికల్ దాడులు..

 


పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు భారత్ మరోసారి బుద్ది చెప్పింది. సర్జికల్ దాడుల మాదిరిగానే మరోసారి పాకిస్థాన్ పై దాడులు జరిపింది భారత సైన్యం. జమ్ము కశ్మీర్ రాష్ట్రంలోని నౌషేరా ప్రాంతం సమీపంలో ఉన్న పాకిస్తాన్ శిబిరాలపై భారత భద్రతా దళాలు ముమ్మరంగా కాల్పులు జరిపాయి. ఈనెల 20, 21 తేదీలలో జరిపిన ఈ దాడుల వివరాలను సైన్యం తాజాగా ప్రకటించింది. ఈ దాడిలో పాకిస్తాన్‌కు చెందిన పలు సైనిక శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం నియంత్రణ రేఖ ప్రాంతం మొత్తం భారత సైన్యం ఆధీనంలోనే ఉందని, తమకు జమ్ము కశ్మీర్‌లో శాంతి నెలకొల్పడమే ముఖ్యమని ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. కొండ ప్రాంతంలో ఉన్న పాకిస్తానీ బంకర్లను ధ్వంసం చేస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోలను కూడా సైన్యం బయటపెట్టింది. పాకిస్తాన్ సైన్యం చొరబాట్లను ప్రోత్సహిస్తూ వాటికి అండగా ఉంటోందని ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అశోక్ నరులా చెప్పారు.