టాయ్‌లెట్‌లో మూడు కిలోల ప్యూర్ గోల్డ్

 

శంషాబాద్ విమానాశ్రయంలోని టాయ్‌లెట్‌లో ఓ బంగారం స్మగ్లర్ మూడు కిలోల బంగారు బిస్కెట్లను పారేశాడు. కస్టమ్స్ అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన నజీర్ అనే వ్యక్తి ఒమన్ నుంచి వచ్చాడు. వస్తూ వస్తూ ఐదు కిలోల బంగారాన్ని తీసుకొచ్చాడు. ఎయిర్ పోర్టులో కస్టమ్స్ నిఘా పటిష్టంగా వుండటం గమనించాడు. అయితే అప్పటికే అతని దగ్గర బంగారం వుందని పసిగట్టిన అధికారులు అతన్ని సోదా చేయడానికి ఎదురుచూస్తున్నారు. దాంతో నజీర్ ఎయిర్ పోర్ట్ టాయ్‌లెట్‌లోకి వెళ్ళి తన దగ్గర వున్న ఐదు కిలోల బంగారంలో మూడు కిలోల బంగారాన్ని టాయ్‌లెట్ కుండీలో పారేశాడు. అయితే కస్టమ్స్ అధికారులు అప్రమత్తమై ఆ బంగారంతోపాటు, నజీర్ దగ్గర వున్న రెండు కిలోల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.