"నెల్లూరులో నాడు ఒక హెడ్మాస్టరు ఉండేవారు.. నేడు లేరు.."  సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్

ఏపీలో జగన్ సీఎం అయిన తరువాత ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు మెరుగు పరిచేందుకు "నాడు నేడు" అనే కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే కార్యకమాన్ని ప్రస్తుత కరోనా పరిస్థితులతో పోల్చుతూ తీవ్ర విమర్శలు చేసారు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ హెడ్ మాస్టర్ తనకు కరోనా సోకిందని, దయచేసి ఆస్పత్రిలో చేర్చుకోవాలంటూ విజ్ఞప్తి చేసి.. ఫలితం లేక చివరకు చనిపోయిన ఘటనకు సంబంధించిన వీడియోను టీడీపీ అధినేత చంద్రబాబు ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 

 

ఈ సందర్భంగా "గురుదేవో భవః" అని భావించే సమాజం మనది అని అయన గుర్తు చేస్తూ.. నెల్లూరులోని మనుబోలు జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ రమేష్‍కుమార్ తనకు కరోనా పాజిటివ్ అని, దయచేసి ఆసుపత్రిలో చేర్చుకుని తన ప్రాణాలను కాపాడమని అటు ఆసుపత్రి సిబ్బందిని, ఇటు అధికారులను, వైసీపీ నేతలను ఎంత వేడుకున్నాఎవరూ కూడా పట్టించుకోలేదని దాంతో చివరికి రమేష్ కన్నుమూశారు అని పేర్కొన్నారు. ఈ దారుణమైన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని "నాడు ఒక హెడ్మాస్టర్ ఉండేవారు. నేడు లేరు. ఇదేనా మీ నాడు-నేడు? " అంటూ రాష్ట్ర ప్రభుత్వం పై మండి పడ్డారు. 

 

"అసలు ఈ రాష్ట్రంలో పాలనాయంత్రాంగం అంటూ ఉందా? తమ ప్రాణాలను కాపాడమని వేడుకుంటూ చనిపోడానికా ప్రజలు మీకు ఓట్లేసి అధికారమిచ్చింది. ఇలాంటి వీడియోలు చూస్తుంటే బాధేస్తోంది. ప్రభుత్వంలో మాత్రం స్పందన లేదు." అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.