జగన్ కు సబ్బం హరి వార్నింగ్

 

కాంగ్రెస్ యంపీ సబ్బం హరి నిన్నమొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేస్తూ, వచ్చే ఎన్నికలలో వైకాపా టికెట్ మీదనే పోటీ చేస్తానని చెపుతూ ఉండేవారు. కానీ, వైకాపా ఆయన మొహం మీదనే తలుపులు వేసేసిన తరువాత నుండి క్రమంగా ఆయన జగన్మోహన్ రెడ్డిపై కత్తులు దూస్తున్నారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని, వైకాపాను పొగిడిన నోటితోనే, ఇప్పుడు జగన్ ఆర్ధిక నేరగాడని, అందుకే తాను తొందరపడి రాజీనామా చేయలేదని అన్నారు. అంతే గాక జగన్ చేతిలో పత్రిక ఉంది కదాని తనపై లేనిపోని రాతలు వ్రాస్తే జగన్ బండారం బయటపెడతానని వార్నింగ్ కూడా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీతో రహస్య అవగాహన ఉందనే సంగతిని కూడా ఆయన దృవీకరించారు. కానీ, దానిని జగన్ సమర్ధంగా దాచిపుచ్చలేకపోవడం వలననే ఆయనకు జనాదరణ తగ్గిపోయిందని అన్నారు. ఏమయినప్పటికీ రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నపుడల్లా, సదరు పార్టీల గురించి, వాటి నేతల గురించీ సామాన్య ప్రజలకు తెలియని అనేక బ్రహ్మరహస్యాలు బయటపెడుతూ, వారి అసలు రంగు తెలుసుకొనే అవకాశం కల్పిస్తుంటారు. ఒకవేళ వైకాపా సబ్బం హరి మొహం మీద తలుపులు వేసి ఉండకపోయుంటే, ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ ఆయన ప్రత్యర్ధులను తిడుతూ ఉండేవారేమో! ప్రస్తుతం సబ్బం హరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, సమైక్యాంధ్ర కోసం ఆయన చేస్తున్న కృషిని పొగుడుతున్నారు. గనుక, ఆయన కిరణ్ పెట్టబోయే కొత్తపార్టీలో చేరబోతున్నారనుకోవాల్సి ఉంటుంది.