పటేల్ సంకల్పం వల్లే తెలంగాణ‌కు విముక్తి

నిజాం బానిస సంకెళ్లలో మగ్గిపోతున్న తెలంగాణ ప్రాంతం నాటి హోంమంత్రి పటేల్ సంకల్పం కారణంగానే భారత్‌లోనే విలీనమైందని భారత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో తెలంగాణ విమోచన దివస్ సంకల్ప సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజ్‌నాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో భారతీయులంతా ఏకమై ఆంగ్లేయులను తరిమికొట్టి ఐకమత్యం శక్తిని ప్రపంచానికి చాటి చెప్పామని చెప్పారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే బలమైన శక్తిగా మారుతోందన్నారు. కాంగ్రెస్ పాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని, అందుకు శిక్షగా అవినీతికి పాల్పడిన మంత్రులు నేడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. కానీ తమ ప్రభుత్వంలో ఏ ఒక్క మంత్రీ అవినీతికి పాల్పడలేదన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు హన్స్‌రాజ్ అహిర్, పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు.