నారా లోకేష్ కు తప్పిన ప్రమాదం
posted on Oct 26, 2020 6:42PM
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు తృటిలో ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్.. ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద ట్రాక్టర్ నడిపారు. టీడీపీ నేతలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజుతో కలిసి ట్రాక్టర్పై వెళుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి ఉప్పటేరు కాల్వలోకి దూసుకెళ్లింది. పక్కనే ఉన్న మంతెన రామరాజు వెంటనే అప్రమత్తమై ట్రాక్టర్ ను అదుపుచేశారు. దీంతో ప్రమాదం తప్పింది. అనంతరం లోకేష్ను ట్రాక్టర్ నుంచి దింపేశారు. హటాత్తుగా జరిగిన ఈ ఘటనతో వెంట ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు హడలిపోయారు. అయితే, ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
గత కొద్దిరోజులుగా భారీ వర్షాలకు ఏపీలోని లోతట్టు ప్రాంతాలు, పంటపొలాలు నీట మునిగాయి. ఈ తరుణంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులను, రైతన్నలను పరామర్శించాలని నారా లోకేష్ సంకల్పించారు. ఇందులో భాగంగా ఇప్పటికే తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో పర్యటించారు. ఇందులో భాగంగానే ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో లోకేష్ పర్యటించారు.