లాలూకి నెలకు రూ. 10 వేల పెన్షన్‌..

 

మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు రూ. 10 వేల పెన్షన్‌ను మంజూరు అయింది. లాలూ ప్రసాద్ యాదవ్ ఏంటీ..ఆయనకు పెన్షన్ ఏంటీ అనుకుంటున్నారా..? తెలుసుకోవాలంటే కాస్త వెనక్కి వెళ్లాల్సిందే. అసలుసంగతేంటంటే.. 1975 వ సంవత్సరంలో ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో జరిగిన ఉద్యమంలో చాలామంది పాల్గొన్నారు. అందులో అప్పటి విద్యార్ధి నాయకుడిగా ఉన్న లాలూ కూడా పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న వారిని మీసా చట్టం కింద అప్పటి ప్రభుత్వం పలువురిని అరెస్ట్ చేసి జైలులో పెట్టింది. అయితే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలు శిక్ష అనుభవించిన వారికి పింఛను ఇచ్చేందుకు బీహార్ ప్రభుత్వం 2009లో ‘జేపీ సేనాని సమ్మాన్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2015లో ఈ పథకానికి కొన్ని సవరణలు చేసి ఆరు నెలల కాలం పాటు జైలు జీవితం గడిపిన వారికి  రూ. 5 వేలు పెన్షన్.. అదే దీర్ఘ కాలం జైలు జీవితం గడిపిన వారికి నెలకు రూ. 10 వేలు పెన్షన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో భాగంగానే ఈ పథకం కింద పింఛను కోరుతూ లాలూ ప్రభుత్వానికి విజ్ఞప్తి పెట్టుకున్నారు. లాలూ విజ్ఞప్తిని ప్రభుత్వం మన్నించి రూ. 10 వేలు పెన్షన్‌ను మంజూరు చేసింది.