కోర్టులో కలుద్దాం.. - కత్తి మహేష్
posted on Jul 17, 2018 11:31AM
కత్తి మహేష్ ఈ మధ్య కాలంలో రోజూ వార్తల్లో వినిపిస్తున్న పేరు. సినిమా విమర్శకుడుగా ఉన్న కత్తి కొన్ని రోజుల క్రితం శ్రీ రాముడుపై సంచలన వ్యాఖ్యలు చేయటంతో నగరంలో ఆందోళనలు ఉద్రిక్తం అయ్యాయి. ఈ ఉద్రిక్తల కారణంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన తెలంగాణ పోలీస్ శాఖ కత్తిని నగర బహిష్కరణ చేసి స్వస్థలమైన చిత్తూరు జిల్లా యల్లమందలో విడిచి పెట్టారు. అనుకోకుండా కత్తి పీలేరు లో సోమవారం ఓ సమావేశంలో ప్రత్యక్షమయ్యారు. ఆయన సమావేశంలో పాల్గొనటం,ప్రెస్ మీట్ పెట్టటం వల్ల శాంతిభద్రతలు అదుపుతప్పుతాయనే ఉద్దేశంతో స్థానిక పోలీసులు కత్తిని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం మదనపల్లె వైపు తీసుకెళ్లారు కాని తాను బెంగళూరు వెళతానని మహేశ్ చెప్పడంతో పోలీసులే దగ్గరుండి ఆయనను బందోబస్తుతో తీసుకెళ్లారు. తాను బహిష్కరణపై కోర్టులోనే తేల్చుకుంటానని ,కోర్టు ద్వారా బహిష్కరణ నిర్ణయాన్ని రద్దు చేయించుకుని గౌరవప్రదంగా మళ్లీ హైదరాబాద్లో అడుగు పెడతానని తెలిపారు.