మీకు అలవాటైన హత్యారాజకీయాలను వారికి అంటగడతారా?

మచిలీపట్నంకు చెందిన వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని అనుచరుడు మోకా భాస్కర రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. 

"ఏసీబీ కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, నిర్భయ కేసులు అయిపోయాయి. ఇప్పుడిక తెలుగుదేశం నేతలపై హత్య కేసులు పెడుతున్నారు. పైగా బీసీ నేతలే లక్ష్యంగా అక్రమకేసులు పెట్టడం ఏంటి? బీసీ నాయకత్వంపై ఎందుకింత పగబట్టారు?" అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

"అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసు, యనమల రామకృష్ణుడుపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసు, అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసులు పెట్టారు. బీద రవిచంద్ర యాదవ్ పై శాసనమండలిలోనే వైసీపీ మంత్రులు దాడి చేసారు. ఇప్పుడు మరో బీసీ నేత కొల్లు రవీంద్రపై  హత్యకేసు బనాయిస్తారా? ఏమిటీ ఉన్మాదం? మీ ప్రలోభాలకు లొంగకపొతే, మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే తెలుగుదేశం నేతలపై ఇంతకు తెగిస్తారా? మీకు అలవాటైన హత్యారాజకీయాలను వారికి అంటగడతారా?" అని మండిపడ్డారు.

"తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసిలే అన్న అక్కసుతో... బీసి నాయకత్వాన్నే అణిచేస్తారా..? దీనికి ఇంతకు ఇంత మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ దుశ్చర్యలను తెలుగుదేశం తీవ్రంగా ఖండిస్తోంది. తెలుగుదేశం బీసీ నేతలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. వారిపై పెడుతున్న అక్రమ కేసులకు వ్యతిరేకంగా ప్రభుత్వం పై అన్నివిధాలా పోరాడుతాం." అని చంద్రబాబు పేర్కొన్నారు.