పరాయి బిడ్డను కాపాడి, తన బిడ్డను పోగొట్టుకున్న తల్లి!
posted on Jun 18, 2019 12:34PM
ఆగి ఉన్న ట్రాక్టర్పైకి నాలుగు సంవత్సరాల వయసున్న పిల్లాడు ఎక్కి దానికున్న తాళాన్ని తిప్పడంతో అది ముందుకు ఉరికింది. అక్కడే ఆడుకుంటున్న మరో చిన్నారి పైనుంచి అది దూసుకెళ్లడంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలి పట్టణం.. అమరావతి ప్లాట్స్ వద్ద సోమవారం చోటుచేసుకుంది.
నాలుగు సంవత్సరాల బాలుడు.. గేరులో ఉంచి ఆపి వెళ్లిన ట్రాక్టర్ తాళం తిప్పడంతో అది ఒక్కసారిగా ముందుకు దూకింది. అదే సమయంలో తన ఏడాదిన్నర బాబు పవన్ ఎక్కడ ఆడుకుంటున్నాడోనని బయటకు వచ్చిన సులోచన అనే మహిళకి ట్రాక్టర్ పై ఉన్న పిల్లాడు భయంతో అరుస్తూ కనిపించగా.. ఒక్క ఉదుటన అక్కడికి వెళ్లి, ట్రాక్టర్ పై ఉన్న చిన్నారిని కిందకు లాగి రక్షించింది. ఈలోగా ట్రాక్టర్ గట్టును ఢీకొని ఆగింది. సులోచన వెనుకకు తిరిగి చూస్తే .. తన బిడ్డ ట్రాక్టర్ కింద నలిగి విగతజీవిగా ఆమెకు కనిపించాడు. బిడ్డ మృతదేహాన్ని చూసి ఆమె గుండెలవిసేలా విలపించింది.
కుటుంబ కలహాల నేపథ్యంలో రెండు నెలల నుంచి సులోచన తన కుమారుడితో సహా తన తండ్రి ఇంట్లో ఉంటోంది. క్యాటరింగ్కు వెళుతూ ఉండే తన మిత్రురాలి ఇంటికి వారం రోజుల క్రితం వచ్చి ఆమెతో పనులకు వెళుతోంది. ఈ క్రమంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు చేశారు.