అమరావతే ఏపీ రాజధాని... వైసీపీకి షాకిచ్చిన కేంద్రం... టీడీపీ మాటకు విలువ..!

 

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కేంద్రం గుర్తించింది. నవంబర్ 8న విడుదల చేసిన ఇండియన్ పొలిటికల్‌ మ్యాప్‌లో అమరావతి పేరు లేకపోవడాన్ని... టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్‌లో ప్రస్తావించడంతో కేంద్రం స్పందించింది. ఇండియన్ పొలిటికల్ మ్యాప్ లో అమరావతి పేరు లేకపోవడం... ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అవమానం మాత్రమే కాదని... అది ప్రధాని మోడీకి కూడా జరిగిన అవమానమని, ఎందుకంటే అమరావతి నిర్మాణానికి స్వయంగా ప్రధానే శంకస్థాపన చేశారంటూ  గల్లా చేసిన వ్యాఖ్యలు కేంద్రాన్ని కదిలించాయి. ఇప్పటికైనా, పొరపాటును సరిచేసి, అమరావతి పేరు ఉండేలా ఇండియన్ మ్యాప్‌ను మరోసారి విడుదల చేయాలని గల్లా డిమాండ్ చేశారు. గల్లా అలా అడిగారో లేదో నెక్ట్స్ డేనే కేంద్ర హోంశాఖ చర్యలు చేపట్టింది.ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్రం మరోసారి మ్యాప్ విడుదల చేసింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సర్వే ఆఫ్ ఇండియా... మ్యాప్‌ ను సరిచేసింది.

అయితే, నవంబరు 8న కేంద్రం విడుదల చేసిన ఇండియన్ పొలిటికల్‌ మ్యాప్‌లో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరు లేకపోవడంపై విమర్శలు చెలరేగాయి. అన్ని రాష్ట్రాల రాజధానులను మ్యాప్ లో ప్రస్తావించిన కేంద్రం... ఏపీ కేపిటల్ అమరావతిని మాత్రం ఎందుకు విస్మరించదనే అనుమానాలు వచ్చాయి. అయితే, రాజధానిపై ఏపీలో గందరగోళం నెలకొనడం, కొత్త ప్రభుత్వం ఆలోచన ఏంటో తెలియకపోవడంతోనే అలా చేసిందేమోనని అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే వైసీపీ ఎంపీలు... మ్యాప్ అంశాన్ని పార్లమెంట్ ప్రస్తావించలేదు. అయితే, అనూహ్యంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్... మ్యాప్ వివాదాన్ని ప్రస్తావించడం.... కేంద్రం వెంటనే దాన్ని సరిచేసి... ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ మళ్లీ మ్యాప్ ను విడుదల చేయడం సంచలనంగా మారింది.

కేంద్రం విడుదల చేసిన మ్యాప్ తో ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించినట్లే భావించాలి. అది కూడా టీడీపీ రిక్వెస్ట్ తర్వాత కేంద్రం మ్యాప్ ను సరిచేసి విడుదల చేయడమంటే అది వైసీపీకి దెబ్బగానే అనుకోవాలి. ఎన్నికలకు ముందు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నా... మళ్లీ ఇఫ్పుడు టీడీపీ దగ్గరవుతుందనే మాట వినిపిస్తోంది. అందుకే, వైసీపీ కంటే టీడీపీ నేతల మాటకే కేంద్రం ఎక్కువ విలువ ఇస్తుందని అంటున్నారు.