తెలంగాణ డే: డెసిషన్ ఎలా ఉండబోతుంది
posted on Jul 30, 2013 10:30AM
ప్రత్యేక రాష్ట్రం దిశగా కాంగ్రెస్ వేగం పెంచిందిజ దశాబ్దాలుగా నలుగుతున్నసమస్యకు ఈ రోజు ఓ పరిష్కారం చూపించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ యూపిఏ భాగస్వామ్య పక్షాలతో చర్చించనుంది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రదాని నివాసంలో జరగనున్న సమన్వయ కమిటీ మీటింగ్లో కాంగ్రెస్ తన నిర్ణయానికి భాగస్వామ్య పక్షాలను ఒప్పించే ప్రయత్నం చేయనుంది..
చాలా రోజులుగా కొద్దిరోజుల్లో అని చెబుతున్న సిడబ్ల్యూసి మీటింగ్ను కూడా ఈ రోజే నిర్వహించడానికి రెడీ అయింది.. సాయంత్ర కో ఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ముగియగానే ఐదున్నర గంటలకు సోనియా నివాసంలో సిడబ్ల్యూసి మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్ ముగియగానే తెలంగాణపై కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని వెల్లడించనుంది.
ఇప్పటికే యుపిఏ భాగస్వామ్య పక్షాలు తెలంగాణ ఏర్పాటుకు సమ్మతించగా మిగతా పక్షాలను కూడా ఈ రోజు ఒప్పించిన ఓ నిర్ణయం వెలువరించాలనుకుంటుంది కాంగ్రెస్.. అయితే కాంగ్రెస్ నిర్ణయం ఎలా ఉండబోతుంది అన్న దాని మీదే ప్రదానంగా చర్చ జరుగుతుంది.
పది జిల్లాల తెలంగాణా? అదనంగా రెండు జిల్లాలు కలిపిన రాయల తెలంగాణా? హైదరాబాద్ను ఎంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తారు? కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారా? ఇలా ఎన్నో ప్రశ్నలకు ఈ రోజు సాయంత్రం ఓ సమాధానం దొరకనుంది. అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి, హైదరాబాద్ను కొంత కాలంపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించనున్నారట.