మహారాష్ట్ర కు సిబిఐ లక్ష్మినారాయణ బదిలీ
posted on Jun 7, 2013 5:50PM
సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ బదిలీ అయ్యారు. ఇక్కడ ఆయన నిర్వహించిన బాధ్యతలను ఇక నుండి చెన్నై సిబిఐ జాయింట్ డైరెక్టర్ అరుణాచలంకు అప్పగిస్తారు. ఈ మేరకు ఢిల్లీలోని సిబిఐ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అరుణాచలం మంగళవారం బాధ్యతలు స్వీకరిస్తారు. లక్ష్మీనారాయణ డిప్యూటేషన్ కాలం ముగిసింది. ఆయన ఇక తన సొంత కేడర్ మహారాష్ట్ర వెళతారు. ఆయన మహారాష్ట్ర పోలీసు శాఖకు బదిలీ అయ్యారని సమాచారం. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గనుల తవ్వకాల కేసులో గాలి జనార్ధన్ రెడ్డి సీబీఐ కేసలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుల విచారణ అధికారిగా ఉన్న జేడీ లక్ష్మీనారాయణ బదిలీ కావడం ఆశ్చర్యకరంగా ఉంది. ఇంతకు ముందు కేంద్రంలో బొగ్గు స్కాం విచారణ అధికారిగా ఉన్న వ్యక్తిని కేంద్రం బదిలీ చేయడంతో సుప్రీంకోర్టు ఆక్షేపించి అదే స్థానంలో నియమించాలని ఆదేశించింది. జేడీ లక్ష్మీనారాయణ మాత్రం బదిలీ అయిపోవడం చర్చకు దారితీస్తోంది.