Home » Beauty Care » అతిమధురం.. ఇలా వాడితే ముఖం మీద మచ్చలు మాయం..!
అతిమధురం.. ఇలా వాడితే ముఖం మీద మచ్చలు మాయం..!

అమ్మాయిలు అందంగా, ఆకర్షణగా కనిపించాలని అనుకుంటారు. మరీ ముఖ్యంగా మేకప్ బ్యూటీస్ అనే మాట కంటే నేచురల్ బ్యూటీ అనిపించుకోవడానికే అమ్మాయిలు ఇష్టపడతారు. చర్మాన్ని సహజంగా కాంతివంతంగా మార్చుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అటు చర్మ సంరక్షణ కోసం.. ఇటు ఆరోగ్యం కోసం ఆయుర్వేదంలో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్న ఔషధం అతిమధురం. అతిమధురం వాడటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చర్మాన్ని కాంతివంతంగా, మెరిసేలా చేస్తుంది. పిగ్మెంటేషన్, నల్ల మచ్చలను తగ్గిస్తుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని బాగు చేస్తాయి. మొటిమలు, మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే చర్మాన్ని అందంగా మార్చుకోవడానికి అతిమధురాన్ని ఎలా ఉపయోగించాలి? ఎలా వాడాలి? తెలుసుకుంటే..
అతిమధురం పేస్ ప్యాక్..
ఒక టీస్పూన్ అతిమధురం పొడిని రోజ్ వాటర్తో కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనిని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత కడిగేయాలి. ఇది చర్మాన్ని తక్షణమే తాజాగా చేసి, కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.
అతిమధురం. తేనె..
ముఖంపై నల్ల మచ్చలు ఉంటే, వాటిని వదిలించుకోవడానికి అతిమధురాన్ని తేనెతో కలిపి వాడాలి. అతిమధురం పొడిలో తేనె కలిపి మచ్చలపై రాయాలి. క్రమం తప్పకుండా వాడటం వల్ల మచ్చలు తేలికపడతాయి.
అతిమధురం, పాలు..
చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి, ఛాయను మెరుగుపరచడానికి, అతిమధురం పొడిని పచ్చి పాలలో కలిపి రాసుకోవాలి. 10-15 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇది చర్మపు రంగును మెరుగుపరుస్తుంది.
అతిమధురం, కలబంద..
మొటిమలను తగ్గించడానికి అతిమధురం మేలు చేస్తుంది. అతిమధురం పొడిని కలబంద జెల్తో కలిపి ముఖానికి రాసుకోవాలి. దీనిని క్రమం తప్పకుండా వాడటం వల్ల మొటిమలు, ఎరుపుదనం తగ్గుతాయి.
అతిమధురం టోనర్..
అతిమధురం తక్షణ మెరుపును కూడా అందిస్తుంది. అతిమధురం పొడిని లేదా వేరును నీటిలో మరిగించి చల్లారనివ్వాలి. దానిని టోనర్గా ఉపయోగించాలి. ఇది చర్మాన్ని బిగుతుగా, తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది.
*రూపశ్రీ.
