Home » Beauty Care » ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్నవాటితోనే పెడిక్యూర్..ఇలా చేస్కోండి!
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్నవాటితోనే పెడిక్యూర్..ఇలా చేస్కోండి!

వేసవి కాలం వేడి కారణంగా, బయట తిరగడం కారణంగా పాదాలు బాగా ఇబ్బంది పడుతుంటాయి. ముఖ్యంగా వేడి శరీరం ఉన్నవారికి పాదాలు, మడమల ప్రాంతంలో చర్మం బాగా చీలినట్టు అవుతుంది, చర్మం చాలా గట్టిగా మారుతుంది కూడా. పాదాల అందం అనే విషయాన్ని పక్కన పెడితే.. పాదాలు చర్మం పగిలిపోకుండా, చీలినట్టు ఉండకుండా.. సాఫ్ట్ గా, స్మూత్ గా ఉండటం కోసం పెడిక్యూర్ చాలా చక్కగా పనిచేస్తుంది. అయితే పాదాల పెడిక్యూర్ కోసం బ్యూటీ పార్లర్ కు వెళితే వందల నుండి వేలాది రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది. కానీ.. ఇంట్లో ఉన్న వాటితోనే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పెడిక్యూర్ చేసుకోవచ్చు. దీని వల్ల పాదాలు బ్యూటీ పార్లర్ ట్రీట్మెంట్ ఫలితాలను గుర్తు చేస్తాయి కూడా. ఇంతకీ ఇంట్లోనే పాదాలకు పెడిక్యూర్ చేసుకోవడానికి ఏం చేయాలి? ఏ పదార్థాలు వాడాలి? వివరంగా తెలుసుకుంటే..
ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకునే స్టెప్స్..
స్టెప్ 1..
పాదాలు చీలమండల వరకు మునిగేంత గోరువెచ్చని నీటిని ఒక టబ్ లేదా పెద్ద గిన్నెలో తీసుకోవాలి. కొద్దిగా బాత్ సాల్ట్, నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ కలపాలి. ఇవి లేకపోతే కొద్దిగా రాళ్ల ఉప్పు అయినా వేసుకోవచ్చు. అలాగే కాస్త షాంపూ కూడా వేసుకోవచ్చు. కావాలనుకుంటే కొన్ని చిన్న నునుపైన గులకరాళ్లను కూడా వేసుకోవచ్చు. ఈ గులకరాళ్లు పాదాలు నీటిలో ఉంచినప్పుడు స్మూత్ గా మసాజ్ చేసినట్టు అనిపిస్తాయి. పాదాలను 15-20 నిమిషాల పాటు నీటిలో నానబెట్టి విశ్రాంతి ఇవ్వాలి. ఆ తర్వాత ఒక టవల్తో పూర్తిగా ఆరబెట్టాలి.
నెయిల్ కటింగ్..
పాదాలను నీటిలో నానబెట్టినప్పుడు గోళ్లు మెత్తబడతాయి. ఇలా మెత్తబడిన గోళ్లను నెయిల్ కట్టర్ తో కట్ చేసుకోవాలి. నెయిల్ కటింగ్ ను పాదాలను నీటిలో నానబెట్టడానికి ముందే అయినా కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పాదాలు నానబెడితే గోళ్ల కింద ఉండే చర్మం మెత్తబడుతుంది. దీని వల్ల ఆ చర్మం తొలగించడం సులువు అవుతుంది.
ఎక్స్పోలియేట్..
పాదాలను ఆరబెట్టిన తర్వాత, ప్రతి గోరు కింద క్యూటికల్ క్రీమ్ను రాసి, కొన్ని నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఈలోగా ఫుట్ స్క్రబ్ను ఉపయోగించి మడమలు, అరికాళ్లపై ఉన్న పొడిబారిన , నిర్జీవమైన చర్మాన్ని సున్నితంగా రుద్దుతూ తొలగించాలి. ఫుట్ స్మ్రబ్ కోసం పంచదార, కాఫీ, నిమ్మరసం మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. అయితే స్ర్కబ్ తో చర్మం మీద మరీ గట్టిగా రుద్దకూడదు. ఆ తర్వాత, క్యూటికల్ క్రీమ్ను తుడిచివేసి, క్యూటికల్ పుష్తో దానిని సున్నితంగా వెనక్కి నెట్టండి. తర్వాత పాదాలను కడుక్కొని, మాయిశ్చరైజర్ను బాగా అప్లై చేయాలి. తగినంత క్రీమ్ తీసుకుని పాదాలకు సున్నితంగా మసాజ్ చేయాలి. క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, పాదాలు ఆరోగ్యంగా కనిపిస్తాయి.
నెయిల్ పాలిష్..
చివరగా ఇష్టమైన నెయిల్ కలర్ను వేసుకోవాలి. బేస్ కోట్ వేసి ఆరనివ్వాలి. ఆ తర్వాత, నెయిల్ పాలిష్ ఒక పొర వేసి అది పూర్తిగా ఆరిన తర్వాత రెండవ పొర వేయాలి. ఇలా చేయడం వల్ల నెయిల్ పాలిష్ ఎక్కువ కాలం నిలుస్తుంది. నెయిల్ పాలిష్ చెక్కుచెదరకుండా ఉండటానికి నెయిల్ పాలిష్ పైన టాప్ కోట్ వేయాలి. ఇది గోళ్లకు మంచి మెరుపును ఇస్తుంది, పాలిష్ ఎక్కువ కాలం నిలిచేలా చేస్తుంది.
*రూపశ్రీ.
