కాదేదీ కథకనర్హం
గుర్రపు కళ్ళెం
రాజాధిరాజ......రాజమార్తాండతేజ.....వంది మాగధులు స్తోత్రం చేసే రాజాధిరాజు కాకపోయినా రంగాపురం జమిందారు రాజా రావుబహుద్దూర్ రంగరాజు గారి దివాణం ......రాణివాసంతో, దాసదాసీ జనంతో , విందులు, విలాసాలు , నాట్యాలు, అతిధి అభ్యాగతులతో కళకళలాడేది --- ఆయనగారి ముఖ్య హాబీ గుర్రపు స్వారీ. ఎంత ఖర్చయినా సరే మంచి గుర్రం కనిపిస్తే కొనకుండా వదిలే వారుకారు. అరడజనుకి తక్కువ కాకుండా నల్లగా, ఎత్తుగా, బలంగా నిగ నిగలాడే గుర్రాలు సాలలో యెప్పుడూ వుండేవి. వాటి సంరక్షణ, మాలిష్ కి ప్రత్యెక మనుషులు. రోజూ ఉదయం, సాయంత్రం గంట స్వారీ చేసేవారాయన. తెల్ల దొరలు అతిధులుగా వచ్చినపుడు గుర్రపు పందేలుండేవి. అయన కుటుంబంలో ప్రతి ఒక్కరు ఆడమగ అందరూ ఐదో ఏట నించి గుర్రపు స్వారీ నేర్చుకోవాల్సిందే. రేసుల సీజనులో సిటీకి వెళ్ళి రేసులలో పాల్గొనడం ఆయనకున్న వ్యసనాలలో ఒకటి. గుర్రాలకయితేనేం వాటి పోషణ కైతేనేం , రేసుల కైతేనేం , సాలీనా వేలకి వేలు ఖర్చు పెట్టె వాడాయన.
ఈ కధంతా ఈనాటిది కాదు. ఆ రంగరాజు గారు పోయి ఏభై ఏళ్ళు అయింది. అయన కొడుకు వేంకటపతిరాజాగారూ కాలధర్మం చేసి పదేళ్లయింది. వెంకటపతి రాజాగారి సుపుత్రుడు రమేష్ చంద్రుడు. రమేష్ చంద్ర రాజా కాదు, ఉత్తి రమేష్ చంద్రుడే అతను. వెంకటపతిరాజాగారి హయాములోనే జమీందారీలు పోయాయి. భరణాలు ఏర్పడ్డాయి. రంగారాజుగారితోటే సగం జమీ అయన వ్యసనాలకీ, సరదాలకి, విలాసాలకి తరిగిపోయింది. అయన కొడుకు వెంకటపతిరాజా మిగిలినది కర్పూరంలా వెలిగించాడు. ఇప్పుడు ఆ దివాణం కళకళలాడడం లేదు. ఆ దాసదాసీ జనం లేరు. విందులు, వినోదాలు లేవు. దివాణం సున్నానికైనా నోచుకోకుండా పాడుపడినట్లయిపోయింది. ఆ గుర్రపుశాలలో గుర్రాలన్నీ పోగా ఒకే ఒక గుర్రం మిగిలింది. అది రమేష్ చంద్రగారి గుర్రం. అది ఏమయినా సరే అమ్మడానికి వీలులేదని పట్టు పట్టగా తోడు లేనిదానిలా ఒకే గుర్రం మిగిలింది.
రమేష్ చంద్ర ఈ దేశంలో చదువు నచ్చక (వంటబట్టక ) విదేశంలో బిజినెస్ మేనేజ్ మెంట్ కోర్సు చదవడానికి వెళ్ళి పదిహేను రోజుల కిత్రమే స్వదేశం స్వగ్రామం తిరిగి వచ్చాడు. రావడం పెద్ద ప్లానుతోనే వచ్చాడు. ఆ గ్రామంలో భూములు, అస్తులు అన్నీ అమ్ముకుని సిటీ వెళ్ళి ఓ రీరోలింగ్ ఫ్యాక్టరీ స్థాపించాలని, ఆ విధంగా చదివిన చదువుని సార్ధకపరచుకోవాలని అనుకున్నాడు. విదేశాలలో వుండి వచ్చాక డర్టీ ఇండియాలో అందునా డర్టీ విలేజీలో వుండాలంటే అతనికి ముళ్ళ మీద వున్నట్టుంది. లంకంత కొంపకి ముసలి తల్లి సుభద్రా దేవి ---ఇద్దరు దాసీలు, ఇద్దరు నౌకర్లు....వూర్లో ఎటు చూసినా పచ్చని పొలాలు , చుట్టూ కొండలు - రైతులు, ఆవులు, గేదెలు - తప్ప సివిలైజ్ డ్ ఎట్ మాస్ ఫియర్ లేని ఆ డర్టీ వూర్లో దినమొక యుగంలా వుంది . ఆస్తులు అమ్ముకు వెళ్ళిపోయే ఆ కొద్దిపాటి వ్యవధి కూడా భరించలేనిదిగా వుందతనికి. ఎంతకని పుస్తకాలు చదవడం , ఎంత కని రెడియోగ్రాం వినడం ! ఉదయం గంట, సాయంత్రం గంట గుర్రపు స్వారీ రాత్రి డ్రింక్స్ .....రికార్డ్సు - పుస్తకాలు తిండి- నిద్ర - పదిరోజులకే యీ జీవితం విసుగెత్తి ఎప్పుడూ పోదామా అని వుంది. ఫారిన్ లో అలవాటయిన మదిరతో పాటు మగువ కోసం అతనికి శరీరం తపిస్తుంది. ఇదే ఏ సిటీలోనో అయితే పర్సు బరువుని బట్టి టెస్టు బట్టి, కావాల్సినవారిని ఎన్నుకోవచ్చు. ఈ డర్టీ విలేజ్ లో పెడ పిసుక్కునే వాళ్ళు తప్ప ఎవరున్నారు? సాయంత్రం గుర్రపు స్వారీతో వంటి నిండా చెమట పట్టాక, వేడినీళ్ళ టబ్ బాత్ తరువాత వెచ్చవెచ్చని విస్కీ -- తరువాత అతనికి యింకా వెచ్చనిదేదో కావాలనిపించిచేది, కావాల్సింది దొరక్క -----నిద్రపట్టక ..... పక్క మీద దొర్లి.... తన మత్తులో నిద్రలోకి జారేవాడు. గత పదిహేను రోజులుగా అదే రొటీన్ తో విసుగెత్తిపోయిన అతనికి.....
ఆ తెల్లారి..... అంటే అతని సంభాషణలో.....ఉదయం తోమ్మిందింటికీ లేవగానే ....కిటికీ లోంచి .....ఓ జవ్వని దర్శన మిచ్చింది. బంతిపువు రంగు చీరకి ఎర్రంచు , పచ్చ జాకెట్టు - జడలో చామంతులు ....నెత్తిన పచ్చ గడ్డి మోపుతో వయ్యారంగా గుర్రాలశాల వైపు వెడుతుంది. గుర్రాల శాలలో రంగడు గుర్రానికి మాలిష్ చేస్తున్నాడు. దూరం నించే చూసినా రమేష్ కళ్ళలో కాంతి వచ్చింది ఆమెని చూడగానే. యిన్నాళ్ళకి తను వెతుకుతున్నదేదో దొరికిందనిపించింది . బ్రష్ నోట్లో పెట్టుకునే చకచక మేడదిగి గుర్రాల శాలవైపు వెళ్ళాడు. గడ్డిమోపు కింద పడేసి వంగుని గడ్డి విప్పి గుర్రం ముందు వేస్తుంది. వంగున్న ఆమె వంపు సొంపులు చూసేసరికి రమేష్ రక్తం వేడెక్కింది. చామనచాయ అయితేనేం ఆమె మోహంలో మంచి కళ వుంది. పెద్ద పెద్ద కళ్ళు - తీర్చినట్లున్న కనుబొమలు ముక్కున ఒంటి తెల్లరాయి ముక్కు పుడక, వంకుల జుత్తు లొంగక చెల్లాచెదరై నుదుటిని పడుతుంది. ఏదో నవ్వుతూ రంగడితో మాట్లాడుతుంటే తెల్లటి పలువరుస తళుక్కుమంది.పెదాలు కాస్త నల్లగా వుంటేనేం ఆ పెదాలలో, కళ్ళలోనే ఏదో ఆకర్షణ వుందనిపించింది రమేష్ కి. ఆ ఎత్తు , లావు, నడుం, అబ్బ ఏం ఫిగర్ ....అందగత్తె కాదు.....కాని ఆమెలో ఏదో ఆకర్షణ ....దీన్నే గాబోలు యింగ్లీషులో స్మార్ట్ నెస్ అంటారు. ఉత్తి స్మార్ట్ నెస్ కాదు సెక్సీగా వుంది. ఈ లలనామణి హటాత్తుగా ఎక్కడనించి వచ్చిపడింది. అసలేవరు? ఇన్నాళ్ళు తన కళ్ళు ఎలా మూసుకుపోయాయి? వాటే లక్కీ డే.....ఓహో ఆ పల్లెటూరి డ్రస్సు లోనే యింత ఆకర్షణీయంగా వుంది. కాస్త నాజూకు డ్రసింగ్ అవుతే .....ఆమె వలువల్ని, తలపుల్లో వలచి చూసి ఆనందిస్తున్నాడు. ఆశగా, ఆబగా .....అలికిడికి తలెత్తి చూసిన రంగడు యజమానిని చూసి తడబిడ పడ్డాడు. రంగడు నిశ్శబ్దం అయిపోగానే తలెత్తిన సీతాలు.....రమేష్ ని చూసి సిగ్గుతో మెలికలు తిరిగి ఒక్క గెంతులో రంగడి వెనక్కి పరిగెత్తింది.
"రంగా......ఎవర్రా...." అన్నాడు రమేష్ కళ్ళేగరేసి సీతాలుని చూపిస్తూ.
"మా ఆడదండి ..." రంగడు సిగ్గుపడ్తూ అన్నాడు.
"ఓహో.....పెళ్ళాడావా.....యెప్పుడు....?"
"మొన్నే నండి, ఆర్నెల్లయిందండి ...."
"అలాగా.....మరిన్నాళ్ళూ ....ఎప్పుడూ చూడలేదే...." సీతాలునే మింగేసేటట్టు చూస్తూ అన్నాడు రమేష్.
'అల్లమ్మకి వల్లు బాగునేదంటే కన్నోరింటికెళ్ళి నిన్నే వచ్చిందండి..."
"అదా సంగతి ....ఒరేయ్ నీ పెళ్ళాం బాగుందిరా....మంచి పెళ్లాన్నే సంపాదించావు. పెరెంటిరా?.....' చనువుగా అడిగాడు.
"సీతాలచ్చండి... సీతా అంటానండి....' యజమాని భార్యని పోగిడినందుకు సంబరంగా, గర్వంగా సీతాలు వంక చూశాడు రంగడు.
సీతాలు సిగ్గుల మొగ్గ అయింది. కళ్ళ చివర్ల నించి చిన్నదొర మిసమిసలాడే రంగుని, వేసుకున్న ఖరీదయిన నైట్ సూట్, మెరిసే నల్ల చెప్పుల మధ్య మల్లె పూవు లాంటి కాళ్ళని , నిగనిగలాడే వంకీల క్రాపుని , చేతికున్న ఖరీదయిన వాచిని .....అన్నీ చూసి అబ్బో చిన్నదొర ఎంత బాగున్నాడనుకుంది సీతాలు.
"వరేయ్ రంగా, మీ సీతాలే కనక సిటీలో వుంటే సినిమా స్టార్ ని మించి పోయేది .....కాస్త షోగ్గా డ్రస్సయిందంటే ....మరి చూసుకో....మంచి ఫోటో జేనిక్ ఫేస్ రా....అనక ఎండ తగ్గేలోపల ఫోటోలు తీస్తాను యిద్దరూ ముస్తాబయి రండిరా ....సీతాలు మంచి చీర కట్టుకురా....రంగా ...నీవూ ......ఆ వేషం తీసి శుభ్రంగా రా....' అన్నాడు.
చిన్నదొర ఆదరభిమానాలకి పొంగిపోతూ ఫోటో తీస్తానన్నందుకు ఆనందంతో తబ్బిబ్బ అయిపోతూ యిద్దరూ దండాలు పెట్టారు. మొదటిసారే యింకా చూస్తె బాగుండదన్నట్టు రమేష్ అయిష్టంగానే అక్కడ నించి కదిలి లోపలికి వెళ్ళాడు.
* * * *
మధ్యాహ్నం రంగడు సీతాలు యిద్దరూ అతి వుత్సాహంగా ముస్తాబయి ఫొటోలకి వచ్చారు. సీతాలు అమ్మగారు తనకిచ్చిన గులాబీ నైలక్స్ చీర కట్టి గులాబి రంగు జాకెట్టు తొడిగి, తోటలో గులాబీలు తలలో పెట్టుకొని నీటుగా కాటుక, బొట్టు పెట్టి తయారైంది. రంగడు రమేష్ యిచ్చిన పాత ప్యాంట్ షర్టు తొడుక్కుని సంబరంగా సీతాలు పక్కన నిలబడ్డాడు. గులాబీ చీరలో ఉదయం కంటే ఆకర్షనీయంగా వున్న సీతాలుని చూసి గుటకలు మింగాడు రమేష్. అతని మెదడు చురుకుగా ఆలోచిస్తుంది. ఫోటోలు తీసే నెపంతో ....'అరె ....అలా మొహం వంచకూడదు , ' అలా కాదు యిటు చూడాలి -' 'ఇలా నవ్వాలి ' ......'ఇలా దగ్గిరగా నిలబడు ' అంటూ గడ్డం ఎత్తి - భుజాలు పట్టుకుని..... అనేక రకాల ఫోజుల్లో నిలబెట్టాడు ఆమెని తాకుతూ ....సీతాలు చిన్న దొరగారి స్పర్శకు ముడుచుకుపోతుంటే - ' ఏటే అలా మెలికలు తిరగ తండవు. దొర చెప్పినట్టు చూడు " అన్నాడు రంగడు. ఫోటోల కార్యక్రమం అయ్యాక ---" వరేయ్ రంగ మేడమీదకి రండిరా పాటలు విందురు గాని, రా సీతాలు నా దగ్గర అంత సిగ్గేమిటి "
భవ బంధాలు
* * *
కొడుక్కి కాస్త బుద్ది వచ్చి, ఈ పరీక్ష గట్టేక్కిస్తే , కొండకి పిల్లాడిని తీసుకు వచ్చి మొక్కు తీర్చుకుంటానని మొక్కుకున్న వరలక్ష్మీ కొడుకు మూడు నెలలు తండ్రి భయంతో చదివి , అత్తెసరు మార్కులతో తన పేరుకి డిగ్రీ తగిలించు కున్నాడు. ఆ సంతోషం సంబరం తో, తిరుపతి ప్రయాణం పెట్టుకుంది . రిజల్స్ వచ్చిన పది రోజులకు. ఏవో మీటింగ్ లు ఉన్నాయని డిల్లీ రమ్మని కబురోచ్చి, "కారులోనేగా మీ ఇద్దరు వెళ్ళండి అన్ని ఏర్పాట్లు చేశా' అన్నాడు దశరద్. "అవిదకయితే భర్త లేకుండా వెళ్లాలనిపించక పోయినా ప్రయాణం అయ్యాక.......వద్దనుకుంది. కొడుక్క్జైయే తండ్రి రావడం లేదని తెలిసి ఎంజాయ్ చేయవచ్చని సంబర పడ్డాడు.
దర్శనం మొక్కు అన్ని యధావిధిగా పూర్తీ అవగానే రాత్రికి కింద తిరుపతి లో వుండి తెల్లారి ఐదు గంటలకు రష్ లేనపుడు బయలుదేరితే తొందరగా ఇల్లు చేరదాం అని కొడుకు తొందర పెట్టితే సరే అంది వరలక్ష్మీ. డ్రైవర్ కి ఎంత గట్టిగా చెప్పినా స్టీరింగ్ ఇవ్వద్దని తండ్రి చెప్పినా, తల్లి వారిస్తున్నా వచ్చినపుడు వూరు పొలిమేరలు దాటిన తరువాత అధారిటీ చేసి తల్లిని బతిమాలి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కొడుకు బాగానే చేస్తున్నాడు బాధ్యతగానే ఉన్నాడని వెళ్ళేటప్పుడు ఇంకేం అనలేదు వరలక్ష్మీ.
తిరుగు ప్రయాణం లో వూరు ఇంకో అరగంట లో చేరిపోతాం అనుకునే లోపలే మృత్యువు లారీ రూపంలో అతి వేగంగా దూసుకు వచ్చి , సెల్లో స్నేహితుడితో మాట్లాడుతూ కాస్త పరధ్యానంగా వున్న ఆదిత్య తేరుకుని స్టీరింగ్ పక్కకి తిప్పెలోగానే ఎదురుగా లారీని డీ కొట్టాడు. రెండు బళ్ళు వేగంలో ఉండడం తో ముందు సీట్లో కూర్చున్న తల్లి కొడుకు లిద్దరూ అక్కడి కక్కడే కన్ను మూసారు. లారీ ముందు భాగం లోకి కారు సగం దూసుకు పోయింది. వెనక సీట్లో కూర్చున్న డ్రైవర్ కి చాలా దెబ్బలు తగిలినా బతికి బయట పడ్డాడు.
పాతికేళ్ళు తనలో సగ భాగంగా నిలిచిన భార్య, తన రక్తం పంచుకు పుట్టిన ఇరవై మూడేళ్ళ కొడుకు, నాటకంలో పాత్రల్లా హటాత్తుగా చెప్పకుండా, నాటకం మధ్యలోంచి మాయమై పొతే, అది, ఆ మాట , ఆయనకి అర్ధమవడానికి అరగంట పట్టింది. తరువాత నోట మాట పడిపోయినట్టు శూన్యం లోకి చూస్తూనే ఎవరేం చెపితే అది చేసాడు. కంట్లో నించి నీటి చుక్క రాలేదు. భార్యని కొడుకుని ఏ లోపం లేకుండా జరగాల్సిన సకల మర్యాదలతో సాగనంపి, గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నాడు. ఆ మూసిన తలుపులు మూడో రోజుకి గానీ తెరుచుకోలేదు. ఎందరు ఎన్ని విధాలు ప్రయత్నించినా.
మూడో రోజు గదిలోంచి వచ్చిన దశరద్ కొత్త జన్మ ఎత్తినట్టు, గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారి ఎగిరి వచ్చినట్టు , గౌతముడు భోధి వృక్షం కింద కూర్చుని మారి బుద్దిడై నట్టు అతి ప్రశాంతంగా బయటికి వచ్చాడు. అర్జున విషాద యోగం ముగిసినట్టు ఎవరేం ఓదార్పు మాటలు చెప్పబోయినా చెయ్యి యెత్తి ఇంక వద్ద అన్నట్టు ఎవరిని మాట్లాడనీయ లేదు . ఇకలే అర్జునా! విషాద యోగం ముగిసింది. నీ కర్తవ్యమ్ నెరవేర్చు అని గదిలో మూడు రోజులుగా ఆపకుండా విన్న భగవద్గీత లో శ్రీకృష్ణుడు బోధించినట్టు , కార్యాచరణ కు దిగిపోయాడు అయన.
మరో నెల రోజులలో అయన అమ్మాల్సిన పొలాలు, పట్నం లో ప్లాట్ లు , ఇల్లు, తోటలు, రైసు మిల్లులు, ఆయిల్ మిల్లులు అన్నీ అమ్మి చేతిలో డబ్బు చేసుకున్నాడు. తన పలుకు బడితో ఆఘమేఘాల మీద పరుగులేత్తించి , ఉండేందుకు ఇల్లు వాడు కోడానికి కారు , భుక్తి కి తగిన డబ్బు మాత్రం ఉంచుకున్నాడు. ఏనాడో తండ్రి కొని పడేసిన భూములు ఈనాడు కొన్ని కోట్లు కురిపిస్తాయని , అయన ఊహకి అందని విషయం. ఎందరికో భుక్తి నిచ్చే మిల్లులు, పొలాలు, అమ్మడానికి కాస్త ఆలోచించినా అందులో పని చేసేవారి బాధ్యత తీసుకునే షరతు మీదే అమ్మి ఎవరికీ అన్యాయం జరక్కుండా చేసారు. ఇన్నేళ్ళుగా తమని, తమ భూమిని నమ్ముకుని బతికిన అందరికీ ఎవరికీ చెందాల్సినవి వారికి అప్పజెప్పి, కార్యాచరణ కు దిగిపోయి, డబ్బు ఉంటె చేయలేని దేముంటుంది.అని మరో రెండు నెలల్లోనే నిరూపించాడు.
నలభయి రోజుల్లో అయన తన వూరిని ఎలా మార్చేసాడో చూసిన ఎవరు నమ్మలేకపోయారు. డబ్బు వుండి, కార్య చరణకి , చిత్తశుద్ది చేతిలో పలుకుబడి , పవర్ ఉంటె, ఏమి చేయగలడో చేసి చూపాడు దశరద్.
వూరులోంచి హైవే వరకు కిలోమీటరున్నర కంకర రోడ్డు సిమెంట్ రోడ్ అయింది....ఏనాడో ఏ జమిందారు లో కట్టిన, శివాలయం, రామాలయం బాగుపడి తల్లి తండ్రుల పేర్లతో వెలిసి రంగులతో, విద్యుద్దీపాలతో వెలిగిపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాల జూనియర్ కాలేజీ గా వెలిసింది. కొత్త గదులు, ల్యాబ్, బ్లాక్ బోర్డులు, టాయిలెట్లు రెండు కొత్త మోడర్న్ గా తయారయి మెరిసిపోతూ ప్లే గ్రౌండ్ ,టీచర్స్ రూం ఒకటేమిటి అన్ని హంగులతో రూపు రేఖలు మార్చుకుంది. భార్య పేరుతొ ఊరిలో నాలుగు దిక్కులా నాలుగు మంచినీళ్ళ ఓవర్ హెడ్ ట్యాంకులు, బజారు లో ప్రతి కూడలి లో , ప్రతి వీధి లో మంచి నీళ్ళ కుళాయి లు, అరడజను బోర్ పంపులు, ఒక వెటర్నరీ ఆసుపత్రి కొడుకు పేరుతొ కొడుక్కి పెంపుడు కుక్కని ప్రాణంగా చూసుకునే వాడని, ప్రభుత్వ ఆసుపత్రి బాగు చేయించి, పాతిక పడకల ఆసుపత్రిగా సకల సదుపాయాలతో , ఉదయం సాయంత్రం రెండు బస్సులు పట్నం నుండి వెళ్ళేవి, వచ్చేవి. పట్నంలో స్కూల్స్ చదివే పిల్లలకి రాకపోకలకు ప్రత్యేకం వేన్. రోడ్డుకి అటు ఇటు బస్ షెల్టర్స్. తల్లి గారి పేర ఒక ఓల్డ్ ఏజ్ హోం. పొలాల మధ్య లో మూడు బోర్ వేల్స్ , ఓ ట్రాక్టర్, రోడ్ల మీద విద్యుద్దీపాలు ....ఒకటేమిటి....చేతిలో వున్న డబ్బంతా ఆఖరు అయ్యే వరకు వూరుకేమి కావాలో సకల సదుపాయాలూ కూర్చాడు. ప్రజలు ఆశ్చర్య ఆనందాలతో ఊరికి దేముడి రూపంలో ఆ దశరధరాముడే వెలిసి వరాలు కురిపించినట్టు కధలు పురాణాల్ల చెప్పుకున్నారు. నిస్వార్ధ సేవ, అంటే ఏమిటో జనానికి అర్ధమైంది. చేతనయింతగా వారి సహాయ సహకారాలు అందించి, తలో పని బాధ్యత యువత తమ భుజాల మీద వేసుకుని, అహర్నిశలు , ఓ యజ్ఞం లా పనులు పూర్తి చేసి కావాల్సిన వేమిటో సూచిస్తూ తోడ్పాటు అందించడమే కాదు డబ్బున్న అసామీలు ఒకరు కోళ్ళ ఫారం , ఇంకొరు కోళ్ళ దాణా మిల్లు, పిండి మిల్లు ఊర్లో దేనికి వెతుక్కునే అవసరం లేకుండా చేసారు.
జనం నోట, పేపర్లో వార్తలు టీవీలో వీడియోలు, ఊరు పొలిమేరలు దాటిపోయి, ఆగమేఘాల మీద రాష్ట్రము అంతా వెళ్ళింది. ముందు నించే అయన ఊర్లో పలుకుబడి, ఎమ్మెల్యే గా వున్నప్పుడే ఆయన చేసిన మంచి పనులు, ప్రజాభిప్రాయం ముఖ్యమంత్రి గారికి కంట గింపుగా వుండేది. తన కంటే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయి తన పదవికే ఎసరు పెట్టి ముఖ్యమంత్రి పదవి కోసమే ఇదంతా చేస్తూ వున్నాడన్న అభిప్రాయం బలపడి ఆయన్ని శత్రువు లా ఎదుర్కోడానికి మర్గాలు వెదక సాగాడు. పోటీపడి అంత ఖర్చు పెట్టగలడా దాచినదంతా జనం పాలు చేయాలి. ఇంకెన్ని ప్రలోభాలు చూపించాలి ప్రజలకి. తలపట్టుకున్నాడు. ఎలక్షన్లు రోజుల్లోకి వచ్చేసాయి. అయన వెర్రి ఎత్తిపోయాడు. పెళ్లాము, కొడుకు చచ్చారు. ఇంకేం చేసుకుంటానని డబ్బంతా వూడ్చి పెట్టి, ఏదో మంచి పనులు చేసేసి, ముఖ్యమంత్రి పదవి కొట్టేడ్డామనుకుని ఎత్తు వేశాడు. గొర్రెల్లా, వెధవలు, వాడి వెంట పడ్డారు. అయన ఉడికి పోయాడు. ఏం చెయ్యాలో తోచక. గోరు చుట్టూ మీద రోకలి పోటులా డిల్లీ నించి దశరద్ పిలుపు వచ్చిందన్న వార్త వచ్చింది . అయిపొయింది తనపని అని నీళ్ళు కారిపోయాడు.
తాను పదవులు ఆశించి ఇదంతా చేయలేదని, ఏదో డబ్బున్నందుకు మంచి పనులు చేసి ప్రశాంతంగా బతకడం, తన ఉద్దేశం . క్షమించండి అని తిరస్కరించాడు దశరద్.
'చూడండి పట్టుమని ఏభయి ఏళ్ళు లేవు మీకు. ఎంతో జీవితం వుంది. మీ ముందు మంచి పనులు చేసే అవకాశం దేముడు మీకిచ్చాడు. మీకు వచ్చిన కష్టం సామాన్యమైనది కాదు, జీవితం అంతా పోగొట్టుకున్న దాన్ని తల్చుకు బాధపదలేరు ఎవరు. వంటరిగా అదే ఆలోచనలతో పిచ్చెత్తి పోయేకంటే మీ ఊరికి చేసినట్టే మీ రాష్ట్రానికి కూడా చేయగలిగినంత చేస్తే మీ మనసుకి తృప్తి , ఏదో చేయగలిగానన్న ఆత్మ తృప్తి లభించి ఏదో సాధించిన సంతోషం దక్కుతుంది. మీ నిస్వర్ద్ సేవ జనం గుర్తించారు. ప్రజలు మీ వెంట వున్నారు. చూడండి చేతిలో అధికారం, డబ్బు ఉంటె ఏదన్నా చేయటానికి సుళువు అవుతుంది. పదవి ఉంటె పరుగులెట్టి పనిచేసే మనుషులు మీ కింద ఉంటారు. ఖాళీ గా కూర్చుని మీ జీవితం వృధా చేసుకోకుండా , చేతికి అందిన అవకాశం తీసుకు ప్రజలకి ఉపయోగపడి మీ జీవితానికి ఓ పరమార్ధం సంపాదించుకోండి. ఇప్పటి ప్రభుత్వం అవినీతి మయం అయి గోల పడుతున్నారు. మీరు ఆదుకుని మీ రాష్ట్రాన్ని కాపాడు కొండి. ఇంతకంటే చెప్పలేను మీ వెంట మేముంటాం ఎప్పుడు అన్నారు.
ఎవరు లేరు ఇంకెందుకు , ఈ డబ్బు ఏం చేసుకుంటాను అన్న ఆలోచనతో ఏడూ ఊరికి మంచి చేద్దాం అన్న ఆలోచన. ఈ విధముగా మలుపు తిరిగి మళ్లీ కొత్త జీవితానికి నాంది అవుతుందని ఎదురు చూడని ఆయన రాత్రంతా ఆలోచించినా, ఎవరు లేని జీవితంలో నిజంగా తాను కోరుకున్న ప్రశాంతత దొరుకుతుందా, అలా బతకడం ...అడవుల్లో ముక్కుమూసుకుని, ఇదివరకు మునీశ్వరుల్లా బతకగలడా సాధ్యమవుతుందా , అంతకంటే మిగతా జీవితం నలుగురికి ఉపయోగ పడితే ప్రజలు, అభిమానుల, పార్టీ వాళ్ళ విన్నపాలతో ఆఖరికి మనసు రెండో మార్గం నే ఎన్నుకుంది.
* * *
అ ఊరులో ఎమ్మెల్యే గా ఎప్పుడూ ఆయనకి ఎదురు లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే లందరూ ఏకగ్రీవంగా ముఖ్యమంత్రి గా ఎన్నుకున్నారు. ప్రతిపక్ష హోదా కూడా అవతల పార్టీకి దక్కలేదు. ముఖ్యమంత్రి పదవే ఆయన్ని వెతుక్కుంటూ చేరింది. మనం చేసిన మంచైనా, చెడు అయినా స్థిత ప్రజ్ఞుడిగా ఉంటె ఫలితం మనల్ని వెతుక్కుంటూ వచ్చి చేరుతుంది అని జనం గుర్తు చేసుకుంటారు ఎప్పుడు.
* * *
నేటి కాలపు మేటి కథకులు
నేటి కాలపు మేటి కథకులు
(పరిచయ వ్యాసాలు)
నాలుగవ సంపుటి
డి. కామేశ్వరి కథల్లో స్త్రీల సంవేదనలు
- డా. నెల్లుట్ల రమాదేవి

అరవయ్యవ దశకంలో మొదలుపెట్టి ఇప్పటివరకూ విస్తృతంగా రచనలు చేస్తూ పాఠకుల అభిమానాన్ని విశేషంగా చూరగొన్న తెలుగు రచయిత్రులలో ముందు వరుసలో ఉండే రచయిత్రి డి.కామేశ్వరి గారు.
ఒక విధంగా అరవైల నుండి ఎనభైల దాకా ఆ ముఫ్ఫై ఏళ్ల కాలాన్ని రచయిత్రుల యుగంగా చెప్పవచ్చు. ఆడపిల్లల చదువులూ, ఉద్యోగాలలో వచ్చిన గణనీయమైన ప్రగతి వల్లనూ, బయటి ప్రపంచం పట్లా, చుట్టూ ఉన్న సమాజం పట్లా వాళ్ళకు ఏర్పడిన అవగహన వల్లనూ, సాహిత్య పఠన వల్లనూ స్త్రీలు ఈ కాలంలో ఎక్కువగా సాహిత్య సృజనకు ఉపక్రమించారు.
1962 సంవత్సరంలో తన తొలి రచనను ప్ర్రారంభించి, కాలానుగుణంగా సరికొత్త కథాంశాలతో, సరళమై కథనంతో రచనలు చేసారు డి. కామేశ్వరి వీరి తొలి రచన 'వనితలు-వస్త్రాలు' అన్న వ్యాసం. తొలి కథ 'ఆనందరావు-ఆకాకర కాయలు'. తొలి నవల 1968 లో వచ్చిన 'కొత్త నీరు'.
ఒకసారి నవలలు వ్రాయడం మొదలుపెట్టాక....రచయితలకు ఏ థీమ్ దొరికినా దానిని కథగా రాయడం కంటే నలలుగా ఎలా మలచాలా అని చూస్తారు. నలభై ఏళ్ల క్రితం నవలలకు ఉన్న ఆదరణా, ప్రాచుర్యం అలాంటివి. తన సమకాలిలందరూ పుంఖానుపుంఖాలుగా నవలలు రచించినా....తాను మాత్రం అటు నవలలూ, ఇటు కథలూ రాస్తూ, ఒకింత కథలపైనే మొగ్గు చూపిన రచయిత్రి ఆమె.
ఇప్పటికి పన్నెండు కథా సంపుటాలు, ఇరవై ఒక్క నవలలు, ఒక యాత్రా రచన, ఒక కవితా సంపుటి వెలువరించిన ఈ రచయిత్రికి కథలంటేనే ఎక్కువ మక్కున అని తెలుస్తోంది. ఆమె మూడు వందలకు పైగా కథలు రాసినా...నాకు లభించిన ఆరు కథాసంపుటాలు, ఒక యాత్రాదర్శిని లోని అయిదు అనుబంధ కథలు, వార్తాపత్రికల్లోని ప్రత్యేక సంచికల్లో, ఆయా సందర్భాల్లో వెలువడ్డ ప్రత్యేక సంకలనాల్లోని కథలూ కలిపి సుమారు నూట యాభై దాకా కథలను నేను చదివాను. రచించబడ్డ కాలాన్ని ఆధారంగా తీసుకుంటే 1960-80 మధ్య మొదటి దశ, 1980- 2000 వరకు రెండవ దశ, 2000-2020 వరకు మూడవ దశగా విభజిస్తే....కథాంశాల పరంగానూ, రచనా సంవిధానంలోనూ, శైలీ, శిల్పం వంటి లక్షణాలలోనూ కామేశ్వరి గారి రచనల్లో వచ్చిన మార్పును అధ్యయనం చేయడానికి వీలయింది.
తొలి నాళ్లలో అందరిలాగానే కథ రాయాలన్న ఆతృత, అన్ని అంశాలూ ఒకే కథలో చెప్పేయాలన్న ఆరాటమూ ఉన్నప్పటికీ చాలా తొందరగానే కథారచన మూలసూత్రాలను ఒంటబట్టించుకున్న కామేశ్వరి గారు తరువాతి రోజుల్లో ఎన్నో గొప్ప కథలను రాశారు. కాలానుగుణంగా పై అన్ని అంశాలలోనూ ఎంతో పరిణతి పొందిన రచయిత్రి కలం నుండి వచ్చిన కథలివి.
కుటుంబ నేపథ్యం
కామేశ్వరి గారు 1935 ఆగష్టు 22 న కాకినాడలో పుట్టారు. చదువుకున్నది కాకినాడ, రామచంద్రాపురం, శుద్ధ శ్రోత్రియులైన ప్రభల రఘురామయ్య, మాణిక్యాంబ వీరి తల్లిదండ్రులు.
1952లో దుర్వాసుల వి.నరసింహం గారితో వివాహం జరిగాక భర్త ఉద్యోగ రీత్యా ఒరిస్సాలో అడుగు పెట్టిన కామేశ్వరి, 1984 దాకా ముఫ్ఫై రెండేళ్ళ పాటు భువనేశ్వర్ లోనే ఉన్నారు. ఎలక్ట్రికల్ డిపార్టు మెంట్ లో చీఫ్ ఇంజనీర్ గా భర్త రిటైర్ అయ్యాక హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి, కుటుంబపరంగా చీకూ చింతా లేని పరిపూర్ణ జీవితం ఆమెది.
పరిశీలనాత్మక రచనలు
సాహిత్యం సృజనాత్మకమైనది. ఎవరో ఒకరి మదిలో రూపుదిద్దుకుని అక్షర రూపంలో వెలువడుతుంది. రచన అనేదే కల్పన అయినప్పటికీ వాస్తవిక సాహిత్యం, కాల్పనిక సాహిత్యం అనే రెండు విభాలుగా రచనలను పేర్కొనడం అలవాటుగా ఉంది. సహజత్వానికి దగ్గరగా, మన చుట్టూ ఉన్న మనుష్యుల గురించో, జరిగిన సంఘటనల ఆధారంగానో చేసిన రచనలను వాస్తవిక జీవిత చిత్రణలుగా బావించడం జరుగుతుంది. అందుకు విరుద్ధంగా, సత్యదూరంగా చేసిన రచనలు కాల్పనిక సాహిత్యంగా పిలవబడ్డాయి.
ఈ రెండు రకాల సాహిత్య సృష్టిలో రచయితలు, రచయిత్రులు అనే తేడా లేకపోయినా పురుషులకు ఉన్న ఎక్స్ పోజర్ కారణంగా వారు కొంచెం వైవిధ్యభరితమైన రచనలు చేయడానికి అవకాశం ఏర్పడింది. అదే సమయంలో స్త్రీలకు కుటుంబ పరమైన, సంఘపరమైన ఆంక్షలూ, పరిమితులూ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువగా కుటుంబ సంబంధాలను దాటి సమస్త మానవ సంబంధాల గురించీ, వారికి తెలియని కోణాల గురించీ రాయడంలో కాస్త వెనుకబడ్డారేమో అనిపిస్తుంది. కామేశ్వరి గారు కూడా అందుకు మినహాయింపు కాకపోయినా తనకు తెలిసిన, తాను చూసిన ప్రపంచాన్ని, కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. ముఖ్యంగా సమస్యల పట్ల లోతైన పరిశీలనతో, వ్యక్తిత్వ వైరుధ్యాల పట్ల స్పష్టమైన అవగాహనతో రచనలు చేసారు.
డి. కామేశ్వరి రచనలు చేస్తున్న కాలంలో మహిళలు రచనా రంగంలో దూసుకుపోతున్నారు. కావిలిపాటి విజయలక్ష్మి, ద్వివేదుల విశాలాక్షి లాంటివారు అప్పటికే నవలా రచనలో పేరు తెచ్చుకోగా, మాలతీచందూర్, కె. రామలక్ష్మి, లత, రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి వంటి వారు ఎంతో ప్రసిద్ధి పొందారు. కోడూరి కౌసల్యాదేవి, యద్దనపూడి సులోచనారాణి......వీరిద్దరూ నవలా రచనలో ఒకప్రభంజనం సృష్టించారు. వీరి నవలలు ఎన్నో పత్రికల్లో సీరియల్స్ గా రావడమే కాక, సినిమా కథలకు ముడి సరుకుగానూ, ప్రచురణకర్తలకు కొంగుబంగారంగానూ మారాయి. మహిళల రచనలే ప్రచురణకర్తలకు ఆదాయమార్గాలుగా తయారయ్యాయి. మగవాళ్ళు కూడా ఆడపేర్లు పెట్టుకుని రాస్తే తప్ప పాఠకులు చదవరని భావించే పరిస్థితి ఏర్పడింది.
వాస్తవిక దృక్పథంతో రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి వంటి రచయిత్రుల రచనలు ఒక ప్రక్క.......సరికొత్త కలల ప్రపంచాన్ని పరిచయం చేస్తూ, 'ఇలా జరిగితే ఎంత బాగుండు' అనిపించేలా ఆరడుగుల అందమైన, ఐశ్వర్యవంతుడైన, ఆదర్శవంతుడైన కథానాయకుడు ఒక పేదింటి అమ్మాయిని కేవలం మంచితనం చూసి పెళ్ళిచేసుకోవడం అనే పాయింట్ తో వచ్చిన పాపులర్ రచనలు మరో ప్రక్క వర్ధిల్లుతోన్న కాలంలోనే రచనా రంగంలోకి ప్రవేశించారు కామేశ్వరి. కాల్పనిక, వాస్తవిక రచనలకు మధ్య ఉండే సన్నటి విభజన రేఖను పట్టుకుని దాన్ని అనుకుని రచనాయాత్ర సాగించారు కామేశ్వరి. అందువల్లనే ఆమె రచనల్లో కథాంశాలు ఎక్కువ శాతం కుటుంబాల చుట్టూ తిరిగినా వాస్తవిక దృక్పథం కనిపిస్తుంది. ఇందుకు ఆమె సునిశితమైన పరిశీలన కారణం అని చెప్పవచ్చు. స్థూలంగా చెప్పాలంటే సామాజిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ, సాంఘిక ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని రచనలు చేసిన అరుదైన రచయిత్రుల్లో కామేశ్వరి ఒకరు.