![]() |
![]() |
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం గ్లోబల్ రేంజ్లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన బన్నీ.. ఇప్పుడు తన క్రేజ్ను మరింత పెంచుకునే పనిలో ఉన్నారు. అయితే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతోంది. బన్నీ ముంబైలో ఒక ఖరీదైన విల్లా కొనుగోలు చేశారని, త్వరలోనే ఆయన ఫ్యామిలీతో సహా అక్కడికి మకాం మార్చబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త విన్న అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. టాలీవుడ్ను వదిలి బన్నీ బాలీవుడ్కు వెళ్ళిపోతున్నారా అని సోషల్ మీడియా వేదికగా చర్చలు మొదలుపెట్టారు.
అసలు ఈ ముంబై ఇంటి గుట్టు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అల్లు అర్జున్ ముంబైలో ఇల్లు కొన్నారన్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. కాకపోతే, ముంబైలో ఆయన ఒక ఇంటిని అద్దెకు తీసుకున్న మాట వాస్తవమే. ప్రస్తుతం బన్నీ తన తదుపరి చిత్రాల కోసం ముంబైలో ఎక్కువగా సమయం గడపాల్సి వస్తోంది. ప్రతిసారీ స్టార్ హోటళ్లలో ఉండటం కంటే, సొంతంగా ఒక ప్రైవేట్ స్పేస్ ఉంటే బాగుంటుందని భావించి ఈ అద్దె ఇంటిని ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం.
ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక భారీ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు, చర్చలు ప్రస్తుతం ముంబైలోనే జరుగుతున్నాయి. అట్లీ టీమ్తో నిరంతరం టచ్లో ఉండేందుకు బన్నీ తరచుగా ముంబై వెళ్తున్నారు. గతంలో హోటల్ స్టే కోసం రోజుకు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేదని, ఆ భారాన్ని తగ్గించుకోవడంతో పాటు షూటింగ్కు సౌకర్యంగా ఉండేందుకు ఈ తాత్కాలిక ఏర్పాట్లు చేసుకున్నారని టాక్.
అల్లు అర్జున్ కేవలం సినిమా షూటింగ్ అవసరాల కోసమే అక్కడ ఉంటున్నారు తప్ప, శాశ్వతంగా ముంబైకి షిఫ్ట్ అయ్యే ఆలోచన లేదని ఆయన సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు. కేవలం 'రాకా' (RAKA) వంటి భారీ ప్రాజెక్టుల పని ముగిసిన తర్వాత తిరిగి హైదరాబాద్లోనే ఉండనున్నారు. ఇప్పటికే ప్రభాస్ వంటి స్టార్ హీరోలు కూడా షూటింగ్ అవసరాల కోసం ఇటలీ వంటి ప్రాంతాల్లో అద్దె ఇళ్లను వాడుతుంటారు, బన్నీ కూడా అదే బాటలో పయనిస్తున్నారు.
![]() |
![]() |