`అర్జున్ రెడ్డి` చిత్రంతో సెన్సేషనల్ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ. సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. అందులో భాగంగానే తమిళ్ లో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరో. మొదట బాల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఇటీవల అవుట్ పుట్ చూసిన నిర్మాతలు సంతృప్తి చెందరక సినిమాను మళ్లీ రీ షూట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఇటీవల నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాలో ఒక్క ధృవ్ ని మినహా మిగతా వాళ్లందరినీ కొత్తవాళ్లను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు నిర్మాతలు. ఇక ఈ విషయం పై దర్శకుడు బాల స్పందిస్తూ క్రియేటివిటీలో విభేదాల కారణంగానే తప్పుకున్నాననీ క్లారిటీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా పై ప్రస్తుతం ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో మొదటిది ఈ సినిమా కోసం గౌతమ్ మీనన్ దర్శకుడుగా తీసుకోనున్నారట. ఇప్పటికే విక్రమ్ గౌతమ్ మీనన్ తో చర్చలు కూడా జరిపినట్లు , అతడు కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాలను స్టైలిష్ గా ప్రజంట్ చేయడంలో దిట్టైన గౌతమ్ మీనన్ అయితే అర్జున్ రెడ్డి రీమేక్ కు కరక్ట్ అని నిర్మాతలు కూడా భావిస్తున్నారట. ఇక ఈ సినిమా కు సంబంధించి మరో వార్త హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే...గతంలో శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ విజయ్ దేవరకొండతో నటించాలని ఉందంటూ ఒక టీవీ షోలో చెప్పుకొచ్చింది. అయితే విజయ్ దేవరకొండతో కాదు కానీ , తనకు ఎంతో క్రేజ్ తెచ్చిన అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ లో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకోవాలన్న ఆలోచనలో నిర్మాతలు ఉన్నారట. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.