![]() |
![]() |

ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. ఈరోజు(ఆగస్టు 12) ఆయన సికింద్రాబాద్ KIMS హాస్పిటల్ లో సర్జరీ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హాస్పిటల్ యాజమాన్యం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని, అయితే ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి 2 నుంచి 3 నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' అనే భారీ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా షూటింగ్ లో భాగంగానే ఆయన గాయపడినట్లు తెలుస్తోంది. ఆయన త్వరగా, పూర్తిగా కోలుకోవడానికి ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అవసరమని వైద్యుల బృందం నిర్ణయించింది. ఈ క్రమంలోనే KIMS హాస్పిటల్స్లో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్లు డాక్టర్ R.A. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాస్ రావు సూరపనేని ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ సక్సెస్ ఫుల్గా పూర్తయింది.
వైద్యులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. సర్జరీ పూర్తిగా విజయవంతమైందని, ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తి క్షేమంగా ఉన్నారని KIMS డైరెక్టర్ అండ్ మెడికల్ సర్వీసెస్ హెడ్ డాక్టర్ సంబిత్ సాహు స్పష్టం చేశారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఆయనకు ప్రత్యేకమైన రిహాబిలిటేషన్ ప్రాసెస్ కూడా ప్రారంభం కానుంది. రాబోయే 2 నుండి 3 నెలల వ్యవధిలో ఎన్టీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో సాధారణ స్థితికి చేరుకుని మళ్లీ సెట్స్లోకి అడుగుపెడతారని వైద్యులు ధీమా వ్యక్తం చేశారు.

Jr NTR Surgery, KIMS Hospital, Health Bulletin
![]() |
![]() |