![]() |
![]() |

సోషల్ మీడియా వేదికగా గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపిన 'రా ఎన్టీఆర్' (RAW NTR) సంస్థ వ్యవహారంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పేరిట భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని హడావుడి చేసిన ఈ సంస్థ, ఇప్పుడు తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తమ అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా ముగింపు ప్రకటన విడుదల చేస్తూ, “విజయం సాధించిన వారందరికీ మా అభినందనలు” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించి గుడ్బై చెప్పడం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
ఈ వివాదం కొన్ని వారాల క్రితం 'రా ఎన్టీఆర్' సంస్థ విడుదల చేసిన ‘ఊరు-వాడ’ అనే భారీ ప్రకటనతో మొదలైంది. ఏకంగా వంద కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ లో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని సదరు సంస్థ స్పష్టం చేసింది. తమిళనాడులో రాజకీయ అరంగేట్రం చేయడానికి ముందు దళపతి విజయ్ తన అభిమాన సంఘాల ద్వారా నిర్వహించిన సేవా కార్యక్రమాల తరహాలోనే ఇవి ఉండటంతో, జూనియర్ ఎన్టీఆర్ కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చేందుకే ఈ వ్యూహం పన్నుతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే ఈ ప్రచారంపై ఎన్టీఆర్ ఆఫీస్ వెంటనే స్పందిస్తూ.. ఆ సంస్థకు ఎన్టీఆర్తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టత ఇచ్చింది. ఎన్టీఆర్ పేరును దుర్వినియోగం చేస్తూ కొందరు వ్యక్తిగత ప్రచారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది హీరో ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగిస్తుందని నందమూరి అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సంస్థ ప్రతినిధి సాయి రూప్ తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి తమ ఆశయం నిస్వార్థమైనదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా, 100 కోట్ల నిధుల సమీకరణపై సరైన సమాధానాలు లేకపోవడంతో విమర్శల తీవ్రత మరింత పెరిగింది.
అటు ఎన్టీఆర్ టీమ్ హెచ్చరికలు, ఇటు సాధారణ అభిమానుల నుంచి వ్యతిరేకత తీవ్రతరం కావడంతో పాటు నిధుల వనరులపై ప్రశ్నలు వేడెక్కడంతో 'రా ఎన్టీఆర్' ఆర్గనైజర్లు వెనక్కి తగ్గక తప్పలేదు. కేవలం ప్రెస్ మీట్ పెట్టిన 4 రోజుల వ్యవధిలోనే సంస్థ తలుపులు మూసివేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం గమనార్హం.
https://x.com/RAWNTR/status/2079942024497975331
Jr NTR, RAW NTR, Shut Down, Ooru Wada, Sai Roop
![]() |
![]() |