Home  »  News  »  ఆకలితో అలమటించిన చిరంజీవి.. మనవడికి తెలీకుండా అన్నం పెట్టిన తల్లి!

Updated : Mar 2, 2026

సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. ప్రేక్షకుల్లో చైతన్యాన్ని నింపే సందేశాలు, బంధాలు, అనుబంధాల గురించి తెలియజెప్పే సాధనం కూడా. అలా ఎన్నో సినిమాల్లో మానవ సంబంధాల గురించి, వారి మధ్య ఉండే అనుబంధాల గురించి చర్చించారు, ప్రేక్షకుల్ని మెప్పించారు. గుండెల్ని పిండేసే అలాంటి ఓ సన్నివేశం మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన ‘స్నేహం కోసం’ చిత్రంలో ఉంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం నిర్మించిన ఈ సినిమాలో మీనా, ప్రకాశ్‌రాజ్, విజయ్‌కుమార్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుజాత, సితార తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాలో చిరంజీవి, విజయ్‌కుమార్‌ల మధ్య స్నేహం, సెంటిమెంట్‌కి సంబంధించిన సన్నివేశాలను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు కె.ఎస్.రవికుమార్. ఆ సన్నివేశం చూసి కంటతడి పెట్టని వారుండరు. అంతటి అద్భుతమైన ఆ సీన్ ఏమిటో చూద్దాం. 

సింహాద్రికి తమ యజమానితో అనుబంధం, ఆయన పట్ల విశ్వాసం ఎక్కువ. సింహాద్రి జైలుకి వెళ్లిన తర్వాత కొడుకు కూడా అదే విశ్వాసంతో యజమాని దగ్గర పనిచేస్తుంటాడు. యజమాని కూతురు క్షేమం కోసం చేయని నేరాన్ని నెత్తిన వేసుకొని జైలుకి వెళ్తాడు సింహాద్రి. 15 ఏళ్లు జైలు జీవితం గడిపి తిరిగి ఊరికి వచ్చిన సింహాద్రిని యజమాని చిన్న కూతురు ఘోరంగా అవమానించి ఇంటి నుంచి గెంటేస్తుంది. 

ఆ అవమానంతోనే కొడుకుని చూసేందుకు తన ఇంటికి వస్తాడు. యజమానికి తీరని ద్రోహం చేశాడని సింహాద్రిపై కోపంతో ఉంటాడు కొడుకు. ఈ విషయం తల్లి ద్వారా తెలుసుకున్న సింహాద్రి దొంగచాటుగా కొడుకుని చూస్తాడు. అదే సమయంలో తనకు ఆకలిగా ఉందని, అన్నం పెట్టమని తల్లిని అడుగుతాడు. మనవడికి తెలియకుండా కొడుక్కి అన్నం పెట్టే ప్రయత్నం చేస్తుందా తల్లి. కొడుక్కి ముద్ద తినిపించేలోపే మనవడు వచ్చి తండ్రిని నానా మాటలు అంటాడు. అయినా సింహాద్రి బాధ పడడు. తన లాగే కొడుకు కూడా యజమాని పట్ల విశ్వాసంగా ఉన్నాడని ఆనందిస్తాడు. 

ఇక అక్కడ ఉండకూడదని వెళ్లిపోతున్న సమయంలో యజమాని అక్కడికి వచ్చి సింహాద్రి జైలుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందీ వివరిస్తాడు. అప్పటివరకు ఆ విషయం తల్లికి తెలీదు. అసలు నిజం ఎవరికీ చెప్పొద్దని యజమాని దగ్గర మాట తీసుకుంటాడు సింహాద్రి. తండ్రీకొడుకుల మధ్య దూరం పెరిగిపోవడానికి చూసి తట్టుకోలేని యజమాని నిజం చెప్పేస్తాడు. విషయం తెలుసుకున్న సింహాద్రి తల్లి, కొడుకు కన్నీరు మున్నీరవుతారు. తన తల్లి చేతితో సింహాద్రిని అన్నం తినకుండా చేసినందుకు బాధపడిన కొడుకు తనే స్వయంగా తండ్రికి అన్నం తినిపిస్తాడు. ఆ వెంటనే తండ్రి కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంటాడు. 

దీనికి సంబంధించిన వీడియోను క్రింద ఇస్తున్నాము. వీక్షించండి ఇలాంటి మరిన్ని భావోద్వేగ సన్నివేశాల కోసం ఇప్ప్పుడే Teluguone cinema ను Subscribe చేసుకోండి. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.