![]() |
![]() |

- స్టాండప్ కామెడీ పేరుతో హద్దు మీరి వ్యాఖ్యలు
- డిప్యూటీ సీఎంనే టార్గెట్ చేస్తే.. చూస్తూ ఊరుకుంటారా?
- కటకటాల పాలైన అనుదీప్ కటికాల!
- బెయిల్ వచ్చినా తప్పని తిప్పలు!
స్టాండప్ కామెడీ పేరుతో సినీ, రాజకీయ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై సెటైర్లు వేయడం కొందరికి అలవాటుగా మారింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మెగా ఫ్యామిలీపై స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల (Anudeep Katikala) చేసిన కొన్ని కామెంట్స్ పెను వివాదానికి దారితీశాయి. అయితే అనుదీప్ ను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేయడం, అతను బెయిల్పై విడుదల కావడం జరిగిపోయాయి. కానీ, ఈ విషయంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.
వివాదానికి కారణం ఏమిటి?
హైదరాబాద్కు చెందిన అనుదీప్ కటికాల ఇటీవల నిర్వహించిన ఒక షోలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, వివాహాలపై కామెంట్స్ చేశాడు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ రామ్ చరణ్, నిహారిక కొణిదెలపై కూడా సెటైర్లు వేశాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మూడు వివాహాలను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్, అలాగే నిహారిక విడాకుల విషయంలో పవన్ సలహా తీసుకోవచ్చని చేసిన జోకులు మెగా అభిమానులకు, జనసేన కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగింది.
పోలీసుల చర్య - అరెస్ట్ వివరాలు:
అనుదీప్ వ్యాఖ్యలపై జనసేన పార్టీ నేత బడే వెంకట కృష్ణ కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనుదీప్ కావాలనే పవన్ కళ్యాణ్ ప్రతిష్టను దిగజార్చేలా, మహిళలను కించపరిచేలా మాట్లాడారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పోలీసులు అనుదీప్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అనుదీప్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, అతని ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఉన్నట్లుగా ఉన్నట్లు గుర్తించారు. ఏప్రిల్ 14న అక్కడ తన తండ్రితో కలిసి పార్కులో ఉండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రైలులో కాకినాడకు తరలించారు.
క్షమాపణలు చెప్పినా తగ్గని వివాదం:
వివాదం ముదురుతోందని గమనించిన అనుదీప్, ఇప్పటికే తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా క్షమాపణలు చెప్పాడు. తన ఉద్దేశం ఎవరినీ నొప్పించడం కాదని, కేవలం కామెడీ కోసమే అలా మాట్లాడానని వివరణ ఇచ్చాడు. అయితే, అతను చేసిన వ్యాఖ్యలు హద్దులు దాటాయని అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
బెయిల్పై విడుదల
అనుదీప్ను కాకినాడ పోలీసులు గురువారం రాత్రి 9 గంటలకు కాకినాడ మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జి బి.శ్రీదేవి ముందు హాజరుపరిచారు. రాత్రి 12 గంటల వరకు వాదనలు కొనసాగాయి. రూ.10 వేల పూచీకత్తుతో అనుదీప్ను బెయిల్పై విడుదల చేశారు. నిబంధనల ప్రకారం విచారణకు సహకరించాలని ఆదేశించారు.
సజ్జనార్ ఏం చేయబోతున్నారు?
అయితే కాకినాడలో బెయిల్ వచ్చినప్పటికీ, హైదరాబాద్ లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మెగా ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనుదీప్ కటికాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారత చిరంజీవి యువత ప్రతినిధులు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సజ్జనార్.. వెంటనే విచారణ జరిపి, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
స్టాండప్ కామెడీ పేరుతో ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకోవడం తరచుగా వివాదాలకు కారణమవుతోంది. అనుదీప్ కటికాల ఉదంతం స్టాండప్ కమెడియన్లు తమ కంటెంట్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి గుర్తుచేస్తోంది.
![]() |
![]() |