సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'బంగార్రాజు' సినిమా. అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య నటించిన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో బంగార్రాజు బ్లాక్ బస్టర్ మీట్ పేరుతో రాజమండ్రిలో తాజాగా సక్సెస్ మీట్ ని నిర్వహించింది మూవీ టీమ్. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన పీపుల్ స్టార్ నారాయణ మూర్తి మూవీ టీమ్ ని అభినందించారు.
మీరంతా అక్కినేని నాగార్జున, నాగ చైతన్య ఫ్యాన్స్ అయితే తాను అక్కినేని నాగేశ్వరరావు అభిమానినని నారాయణ మూర్తి చెప్పారు. ఆయన ఆశీస్సులతో బంగార్రాజు సినిమా ఇంతటి విజయాన్ని సాధించిందని అన్నారు. అన్నయ్య, శ్రీరామదాసు వంటి సినిమాలతో జన్మధన్యం చేసుకున్న మహానుభావుడు నాగార్జున అని అన్నారు. అలాగే నాగ చైతన్య వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆయన ఇంత బాగా చేస్తాడని అసలు అనుకోలేదు. బంగార్రాజులో నాగచైతన్య అద్భుతంగా నటించారని కొనియాడారు. కళ్యాణ్ కృష్ణ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. ఆయనలో కె.రాఘవేంద్రరావు కనిపించాడు అని నారాయణ మూర్తి ప్రశంసించారు.
"ఈ సినిమా విజయం మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది కూడా. ఎందుకంటే జనవరి 11 నే లాక్ డౌన్(నైట్ కర్ఫ్యూ) పెట్టాలనుకున్న ఆయన.. సంక్రాంతి పండగని దృష్టిలో పెట్టుకొని, సినిమాలను కూడా కాపాడాలన్న ఉద్దేశంలో కర్ఫ్యూ నాలుగు రోజులు వాయిదా వేశారు. ఆ నాలుగు రోజుల్లో బంగార్రాజు భారీ కలెక్షన్స్ రాబట్టింది. అలా సినిమా విజయానికి కారణమైన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు" అని నారాయణ మూర్తి అన్నారు.