ఇటీవల 'ఆచార్య' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'గాడ్ ఫాదర్', 'వాల్తేరు వీరయ్య', 'భోళా శంకర్' వంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా మెగాస్టార్ మరో సినిమాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాను మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నామని స్వయంగా చిరుని ప్రకటించాడు.
గోపీచంద్, రాశి ఖన్నా జంటగా మారుతి డైరెక్షన్ లో రూపొందిన సినిమా 'పక్కా కమర్షియల్'. ఈ మూవీ జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ.. మారుతి డైరెక్షన్ లో సినిమా చేయడానికి తాను రెడీగా ఉన్నానని అన్నాడు.
"మారుతితో ఎప్పటినుంచో బాండింగ్ ఉంది. ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు నా ఆలోచనలకు తగ్గట్లు ప్లాగ్ ని గ్రాఫికల్ గా డిజైన్ చేశాడు. ఆ తర్వాత పార్టీకి సంబంధించి ఒక సాంగ్ ని రికార్డుని చేశాం. ఆ సాంగ్ కి మారుతిని విజువల్స్ తీసుకొని రమ్మంటే.. నేను చేయగలనంటారా అన్నాడు. నువ్వు చేయగలవు అని చెప్పి టీమ్ ని ఇచ్చి పంపించాం. చాలా మంచి ఔట్ పుట్ ఇచ్చాడు. అది చూసి నీకు డైరెక్షన్ ఆసక్తి ఉందా? అని అడిగితే.. లేదు సార్ కొన్ని కథలు అనుకొని, కంప్యూటర్ గ్రాఫిక్ మీద జెనరేట్ చేస్తానని చెప్పాడు. అప్పుడే డైరెక్షన్ మీద దృష్టి పెట్టమని చెప్పాను.. ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాడు." అని చిరంజీవి ప్రశంసించాడు.
"ఇటీవల యూవీ క్రియేషన్స్ విక్కీ(విక్రమ్) వచ్చి మీతో, మారుతితో సినిమా చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఫెంటాస్టిక్ అన్నాను. మారుతి మా కుర్రాడు. నన్ను ఎలా మలచాలి?, ఎలా చూపించాలి? అనే విషయంలో ఒక అభిమాన డైరెక్టర్ గా మారుతి చేసినట్లుగా ఎవరూ చేయలేరు. మారుతి ఖచ్చితంగా చేయగలడు, నాకు ఆ నమ్మకం ఉంది. మీరు అనుకుంటే ఈ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టండని చెప్పాను. ప్రస్తుతం మారుతి కమిట్ అయిన సినిమాలు పూర్తయ్యాక.. నేను సినిమా చేయడానికి రెడీ." అని మెగాస్టార్ చెప్పుకొచ్చారు.