![]() |

'బింబిసార' వంటి సోషియో ఫాంటసీ హిట్తో సత్తా చాటిన యువ దర్శకుడు వశిష్ట, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో 'విశ్వంభర' (Vishwambhara) అనే భారీ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. అయితే, వశిష్ట కెరీర్లో ఒక వింతైన సెంటిమెంట్ ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ సెంటిమెంట్ ఏంటంటే.. వారసుల కోసం కథలు పట్టుకెళ్తే, తండ్రులతో సినిమాలు ఓకే అవుతున్నాయి.
రామ్ చరణ్ తో సినిమా ప్లాన్!
వశిష్ట తన రెండో సినిమా కోసం మొదట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ను సంప్రదించారు. చరణ్ కోసం ఒక అద్భుతమైన సోషియో ఫాంటసీ కథను సిద్ధం చేసి వినిపించారు. చరణ్కు ఆ కథ నచ్చినప్పటికీ, అప్పటికే ఆయన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల సమయం పట్టింది. అదే సమయంలో ఈ కథా చర్చల్లో చిరంజీవికి ఒక లైన్ చెప్పడం, అది ఆయనకు బాగా నచ్చడంతో వెంటనే 'విశ్వంభర' ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. అలా చరణ్ కోసం అనుకున్న ప్లాన్, చిరంజీవితో భారీ విజువల్ వండర్గా మారింది.
ఇప్పుడు మోక్షజ్ఞ విషయంలోనూ అదే సీన్!
ప్రస్తుతం నందమూరి అభిమానులంతా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ (Mokshagna) ఎంట్రీ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ లాంచ్ కోసం బాలకృష్ణ సరైన దర్శకుడి వేటలో ఉండగా, వశిష్ట ఒక ఇంట్రెస్టింగ్ కథను మోక్షజ్ఞకు వినిపించినట్లు వార్తలు వచ్చాయి. బాలయ్యకు కూడా ఆ కథ నచ్చింది. కానీ, ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటుచేసుకుంది.
మోక్షజ్ఞ తన మొదటి సినిమా ప్రేమ కథ అయితే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నాడట. మరోవైపు ఈ కథా చర్చల సమయంలో బాలయ్యకు కూడా ఓ కథ వినిపించారట వశిష్ట. కథ బాగా నచ్చడంతో.. మోక్షజ్ఞ సినిమా కంటే ముందు వశిష్ట దర్శకత్వంలో బాలకృష్ణ ఒక ప్రాజెక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంటే మెగా కాంపౌండ్లో జరిగినట్లే, ఇక్కడ కూడా కొడుకుతో సినిమా చేయాలని వెళ్తే, తండ్రి ప్రాజెక్టు సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
సోషియో ఫాంటసీపై పట్టు
వశిష్ట శైలిలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన రాసుకునే కథలు ఫాంటసీ అంశాలతో ముడిపడి ఉంటాయి. బాలయ్యకు ఇలాంటి సోషియో ఫాంటసీ కథలంటే ప్రాణం. అందుకే వశిష్టతో సినిమా చేయడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ‘విశ్వంభర’ విడుదలై మంచి విజయం సాధిస్తే, బాలయ్య-వశిష్ట కాంబినేషన్పై భారీ అంచనాలు ఏర్పడతాయి అనడంలో సందేహం లేదు.
![]() |