Home  »  Featured Articles  »  స్టార్ అవ్వాల్సిన ‘ఆంధ్రా దేవానంద్’.. క్యాన్స‌ర్ బారిన ప‌డి ఎలా చ‌నిపోయారో తెలుసా?

Updated : Jul 21, 2026

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో "అదృష్టవంతుడిని ఎవ్వరూ పాడు చేయలేరు.. అలాగే దురదృష్టవంతుడిని ఎవ్వరూ బాగు చేయలేరు" అనే మాటకూ, కాలం చేసే వింత నాటకాలకూ నిలువెత్తు నిదర్శనం ఒకప్పటి ప్రముఖ కథానాయకుడు రామ్మోహన్ జీవితం. ఒకే ఒక్క తొలి సినిమాతోనే తిరుగులేని విజయాన్ని అందుకుని, అప్పటి ప్రేక్షకులతో ‘ఆంధ్రా దేవానంద్’ అని ప్రశంసలు పొందిన ఆయన, ఆ తర్వాత కేవలం ఐదు పది సినిమాలకే పరిమితమై అధఃపాతాళానికి పడిపోవడం సినీ చరిత్రలోనే ఒక పెద్ద విషాదం. ఆయనతో పాటే చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఘట్టమనేని కృష్ణ సూపర్ స్టార్‌గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంటే, రామ్మోహన్ మాత్రం వెండితెర వెలుగుల నుంచి ఒక్కసారిగా చీకట్లోకి జారిపోయారు. ఆదుర్తి సుబ్బారావు లాంటి దిగ్గజ దర్శకుడి చేతిలో రూపుదిద్దుకున్న ఈ న‌టుడి జీవితం చివరకు ఎందుకు అంత విషాదకరంగా ముగిసింది? ఆయన పతనానికి స్వయంకృతమే కారణమా లేక అదృష్టం తలరాతను మార్చేసిందా అనేది ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది.

వారణాసి రామ్మోహన్ రావు 1939 ఫిబ్రవరి 4వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా గిద్దలూరులో వారణాసి రామారావు దంపతులకు జన్మించారు. ఎనిమిది మంది పిల్లలున్న ఆ పెద్ద కుటుంబంలో రామ్మోహన్ రెండవ సంతానం. ఆయన కర్నూలులో డిగ్రీ చదువు పూర్తి చేశారు. అయితే డిగ్రీ పూర్తి కాగానే తండ్రి అకాల మరణంతో కుటుంబ భారమంతా ఈయన భుజాలపై పడింది. దాంతో పైచదువులకు స్వస్తి చెప్పి, ఉద్యోగ వేటలో భాగంగా హైదరాబాద్ చేరుకుని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) సంస్థలో టెక్నీషియన్‌గా ఉద్యోగంలో చేరారు. చిన్నతనంలో వేసిన ఒకే ఒక్క నాటకం తప్ప ఆయనకు నటనలో ఎలాంటి అనుభవమూ లేదు. అసలు భవిష్యత్తులో నటుడిని అవుతానని గానీ, సినిమాలో కనిపిస్తానని గానీ ఆయన కనీసం ఊహించలేదు. పేపర్లలో కొత్త నటులు కావాలనే ప్రకటనలు చూసినా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆ ఆలోచనలను పక్కన పెట్టేవారు.

ఆ సమయంలో 'మూగ మనసులు', 'డాక్టర్ చక్రవర్తి' లాంటి అద్భుత విజయాల తర్వాత దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు పూర్తిగా కొత్తవారితో 'తేనె మనసులు' అనే సాహసోపేత  చిత్రాన్ని నిర్మించ తలపెట్టారు. దినపత్రికల్లో ప్రకటన చూసి వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. విశేషమేమిటంటే, ఆ రోజుల్లో కృష్ణతో పాటు కృష్ణంరాజు, డ్రీమ్ గర్ల్ హేమామాలిని, జయలలిత వంటి వారు కూడా తమ ఫోటోలను పంపించారు. అయితే ఆదుర్తి తమ్ముడు హరినాథ్‌కు పరిచయస్థుడైన రామ్మోహన్ ఫోటోలను నేరుగా ఆదుర్తికి చూపించడంతో ఆయనను స్క్రీన్ టెస్ట్‌కు పిలిచారు. చెన్నై బీచ్‌లో ఆదుర్తి సుబ్బారావు, కె.విశ్వనాథ్...  రామ్మోహన్, కృష్ణ, సంధ్యారాణి, సుకన్యలకు కొన్ని రోజుల పాటు డైలాగ్ డెలివరీ, నటనలో కఠిన శిక్షణ ఇచ్చారు.

అలా 1964 జూన్ నెలలో హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో 'తేనె మనసులు' చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. తొలి షాట్ రామ్మోహన్, సుకన్యలపైనే చిత్రీకరించారు. ఆ తర్వాత 1965 మార్చి 31న విడుదలైన 'తేనె మనసులు' బాక్సాఫీస్ వద్ద రికార్డు విజయం సాధించింది. ఈ సినిమాలో నటించిన ఇద్దరు హీరోల్లో రామ్మోహన్‌కే తిరుగులేని భవిష్యత్తు ఉందని, కృష్ణ కంటే రామ్మోహన్ గొప్ప స్టార్ అవుతారని సినీ విశ్లేషకులు భావించారు. ఆయన గ్లామర్, యాక్టింగ్ చూసి ‘ఆంధ్రా దేవానంద్’ అని బిరుదు ఇచ్చారు. ఆ తర్వాత ఆదుర్తి వీరిద్దరితోనే ‘క‌న్నెమ‌న‌సులు’ తీశారు. అనంతరం చంద్రమోహన్ పరిచయమైన 'రంగుల రాట్నం'లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రామ్మోహన్ మెప్పించారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'ప్రైవేట్ మాస్టర్', అలాగే 'లక్ష్మీ నివాసం', 'ఉపాయంలో అపాయం', 'అన్నదమ్ములు' వంటి చిత్రాల్లో లీడ్ హీరోగా నటించి అప్పట్లో మంచి డిమాండ్ ఉన్న నటుడిగా వెలిగారు.

అయితే కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే విధి విచిత్రమైన మలుపు తిరిగింది. గ్లామర్ ప్రపంచంలో వచ్చిన కీర్తి ప్రతిష్టలు, చెడు వ్యసనాలు, సరికాని స్నేహాలు ఆయనను పక్కదారి పట్టించాయి. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి షూటింగ్‌లకు ఆలస్యంగా రావడం, వ్యక్తిగత జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయన కెరీర్‌ను కోలుకోలేని దెబ్బతీశాయి. నిర్మాతలు ఆయనను దూరం పెట్టడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే రామ్మోహన్ పక్కన సెకండ్ లీడ్‌గా చేసిన కృష్ణ టాలీవుడ్ సూపర్ స్టార్‌గా ఎదిగారు. మిత్రుడి పరిస్థితి చూసి చలించిపోయిన కృష్ణ, తన సొంత బ్యానర్ చిత్రాలైన 'అల్లూరి సీతారామరాజు', 'పండంటి కాపురం' వంటి పెద్ద సినిమాల్లో రామ్మోహన్‌కు మంచి పాత్రలు ఇచ్చి ఆర్థికంగా చేయూతనందించారు. కానీ కాలం మించిపోవడంతో రామ్మోహన్ హైదరాబాద్ తిరిగి వచ్చి ఒంటరి జీవితాన్ని గడిపారు. "నన్ను కన్నతల్లిలా ఆదరించిన సినీ పరిశ్రమను నా సొంత తప్పుల వల్లే వదులుకున్నాను" అని చివరి రోజుల్లో తీవ్రంగా బాధపడేవారు. చెల్లెళ్లు, తమ్ముళ్ల పెళ్లిళ్లు చేసి బాధ్యతగల అన్నగా నిలిచినా, చివరి దశలో ఒంటరితనం, క్యాన్సర్ వ్యాధి ఆయనను చుట్టుముట్టాయి. వైద్యానికి కూడా తగినంత డబ్బు లేక అత్యంత దీన స్థితిలో ఆ నాటి 'ఆంధ్ర దేవానంద్' రామ్మోహన్ కన్నుమూయడం సినీ చరిత్రలో ఒక హెచ్చరికగా మిగిలిపోయింది.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.