Home  »  Bollywood News  »  Amitabh bachchan: అమితాబ్ బచ్చన్ ల్యాండ్‌ డీల్‌.. రాత్రి 3 గంటల ఫోన్‌ కాల్‌ వెనుక అసలు కథ!

Updated : Jul 6, 2026

 

భారతీయ చిత్రపరిశ్రమతో పాటు అభిమానులు, ప్రేక్షకులు  సగర్వంగా చెప్పుకునే లెజండ్రీ హీరో అమితాబ్ బచ్చన్. ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ అనే తేడా లేకుండా నాన్ స్టాప్ గా దూసుకుపోతున్నాడు. అమితాబ్ చేసే రియల్ ఎస్టేట్ పెట్టుబడుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో ఆయన చేసిన భూముల కొనుగోళ్లు ఎప్పుడూ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. అయితే, అమితాబ్ బచ్చన్ అయోధ్యలో తన మొదటి భూమిని ఎలా కొనుగోలు చేశారు? ఆ డీల్ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏమిటో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ 'ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా' అధినేత అభినందన్ లోధా ఒక సదస్సులో బయటపెట్టారు. కేవలం ఒకే ఒక్క రాత్రి వేళ వచ్చిన ఫోన్ కాల్, ఆ తర్వాత కేవలం 24 గంటల్లోనే కోట్లాది రూపాయల లావాదేవీ ఎలా జరిగిపోయిందో ఆయన వివరించిన తీరు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

అది 2023వ సంవత్సరం. అభినందన్ లోధా ఏదో పని మీద ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. అక్కడ స్థానిక సమయం ప్రకారం అర్ధరాత్రి దాటి సరిగ్గా తెల్లవారుజామున 3 గంటలు అవుతోంది. ఆ సమయంలో లోధా మొబైల్‌కు కొన్ని మిస్డ్‌ కాల్స్ వచ్చాయి. ఆ వెంటనే ఒక టెక్స్ట్ మెసేజ్ కూడా వచ్చింది. ఆ మెసేజ్‌లో "నేను అమితాబ్ బచ్చన్‌ను మాట్లాడుతున్నాను.. మీకు వీలైనప్పుడు నాకు దయచేసి కాల్ బ్యాక్ చేయండి" అని ఉంది. ఆ మెసేజ్ చూడగానే అభినందన్ లోధా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నిద్రమత్తు వదిలి, వెంటనే అమితాబ్‌కి తిరిగి ఫోన్ చేశారు. భారతదేశపు అత్యంత పెద్ద నటుడి నుండి అంతటి వినయపూర్వకమైన మెసేజ్ రావడం ఆయనను ఎంతగానో కదిలించింది.

ఫోన్ ఎత్తగానే అమితాబ్ బచ్చన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయం చెప్పారు. "అభినందన్ జీ, నేను ఉత్తరప్రదేశ్ వాసిని. నాకు మన పవిత్రమైన అయోధ్య నగరంలో కొంత భూమి కావాలి" అని  చాలా స్పష్టంగా చెప్పారు. దానికి లోధా స్పందిస్తూ, తప్పకుండా సార్, మీకోసం మేము ఆ ఏర్పాట్లు చేస్తాము అని హామీ ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే ల్యాండ్ ధర గురించిన ప్రస్తావన వచ్చింది. దేశంలోనే అతిపెద్ద స్టార్‌తో రేట్ల గురించి మాట్లాడటానికి లోధా కాస్త సంకోచించారు. "సార్, మీతో నేను ధర గురించి ఎలా మాట్లాడగలను?" అని లోధా అడగ్గా, అమితాబ్ మాత్రం సాధారణ కొనుగోలుదారుడిలాగే వ్యాపార నియమాల ప్రకారం డీల్ పూర్తి చేయాలని పట్టుబట్టారు. తనకు 15,000 చదరపు అడుగుల స్థలం కావాలని చెప్పారు. దానికి లోధా సుమారుగా 15 కోట్లు అవుతుందని అంచనా చెప్పారు. ఆ మరుసటి రోజే అమితాబ్ బచ్చన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, మొత్తం 15 కోట్ల రూపాయలని  లోధా సంస్థకు బదిలీ చేసేశారు. అలా కేవలం ఒకే ఒక్క రోజులో ఆ 15,000 చదరపు అడుగుల ప్లాట్ డీల్ పూర్తయింది. అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపనకు ముందే అక్కడ భూమి కొనుగోలు చేసిన మొదటి సెలబ్రిటీగా అమితాబ్ బచ్చన్ నిలిచారు. 'ది సరయూ' ప్రాజెక్ట్‌లో ఆయన కొన్న ఆ మొదటి ప్లాట్ ధర 14.5 కోట్లు కావడం గమనార్హం.

Also read: Toxic: ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది.. కథ వింటే షాక్ అవుతారు 


అమితాబ్ బచ్చన్ అయోధ్యపై ఉన్న భక్తితో, నమ్మకంతో తన పెట్టుబడులను అక్కడితో ఆపలేదు. ఆ తర్వాత తన తండ్రి పేరిట ఉన్న 'హరివంశ్ రాయ్ బచ్చన్ మెమోరియల్ ట్రస్ట్' ద్వారా రామమందిరానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో మరో 54,454 చదరపు అడుగుల భారీ స్థలాన్ని సేకరించారు. అంతేకాదు, 2025 మే నెలలో 'ది సరయూ' ప్రాజెక్ట్ పక్కనే మరో 25,000 చదరపు అడుగుల ప్లాట్‌ను దాదాపు . 40 కోట్లకు కొనుగోలు చేశారు. ఇక 2026 మార్చి నెలలో తిహురా మజా ప్రాంతంలో 2.67 ఎకరాల భారీ భూభాగాన్ని ఏకంగా రూ. 35 కోట్లతో తన ఖాతాలో వేసుకున్నారు. అయోధ్యలో భూముల విలువలు 2020 నుండి 2025 మధ్య కాలంలో 4.5 రెట్లు పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.