గజముఖుని తర్వాత పార్వతీ పరమేశ్వరులకు ఆరుముఖాలతో కుమారస్వామి జన్మించాడు. ఆరుముఖాలు కలవాడు కనుక షణ్ముఖుడనీ, కృత్తికా నక్షత్రంలో జన్మించాడు కనుక కార్తికేయుడనీ.., కుమారస్వామిని అంటారు. గజముఖుడు లంబోదరుడు, మరుగుజ్జువాడు. కుమారస్వామి మన్మధుని మించిన అందగాడు. ఒకసారి దేవతలు, మహర్షులు పరమేశ్వరుని సందర్శించి, సేవించి..ఇలా అడిగారు. ‘పరమేశ్వరా..., సర్వదేవగణాలకూ అధిపతిగా మహేంద్రుడు ఉన్నాడు. యక్షగణాలకు అధాపతిగా కుబేరుడు ఉన్నాడు. పక్షిగణాలకు అధిపతిగా గరుత్మంతుడు, పన్నగ గణాలకు అధిపతిగా వాసుకి ఉన్నారు. అలాగే ఋషిగణాలకూ, సిద్ధ, సాధ్య,కిన్నర, కింపురుష గణాలకూ అధిపతులున్నారు. ఇక ప్రమథ, పిశాచగణాలలకు అధిపతిగా సాక్షాత్తు తమరే ఉన్నారు. కానీ, విఘ్నగణాలకు నేటి వరకూ అధిపతి లేడు. కనుక తమ కుమారులలో ఎవరో ఒకరిని విఘ్నగణాలకు అధిపతిగా నియమించండి’ అని ప్రార్థించారు. విఘ్నగణాధిపత్యం విషయంలో గజముఖునికి, కుమారస్వామికి మధ్య గట్టి పోటీ ఏర్పడింది. అన్నయ్య మరుగుజ్జువాడు, అసమర్ధుడు కనుక విఘ్నగణాధిపత్యం తనకే కావాలన్నాడు కుమారస్వామి. నేనే జ్యేష్ఠకుమారుణ్ణి కనుక నాకే విఘ్నగణాధిపత్యం ఇవ్వాలి అన్నాడు గజముఖుడు. అప్పుడు శివుడు తన కుమారుల నద్దేశించి..., ‘మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదీజలాలలో స్నానమాచరించి ముందుగా నా దగ్గరకు వస్తారో వారే ఈ విఘ్నగణాధిపత్యం లభిస్తుంది’ అన్నాడు.