నీకు ఎవరు చెప్పారో..మాకు నువ్వు చెప్పు
posted on Jan 12, 2019 3:29PM
వైసీపీ పొత్తుకోసం రాయబారిగా టీఆర్ఎస్ నేతలను పంపిందని జనసేన అధినేత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేత పార్థసారథి స్పందించారు. పవన్ కల్యాణ్ను వైసీపీతో కలవమని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్కు వైసీపీతో కలిసి పనిచేయాలన్న కోరిక ఉన్నట్లు ఉందని, అందుకే అలా మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. ఎవరి సహకారం తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మానసికంగా ఓటమికి సిద్దమైనట్లు ఉన్నారని, అందుకనే జగన్ చేపడతానన్న పధకాలను కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని.. ఎన్నికల స్టంట్ లో భాగంగా చంద్రబాబు అనేక శంకుస్థాపనలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం ఆర్ధికంగా దివాలా తీసే స్థితిలో ఉందని అన్నారు.ఇక జగన్పై హత్యాయత్నం కేసు ఎన్ఐఏకు అప్పగిస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.