ఇడుపుల పాయలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని బలవన్మరణం
posted on Apr 15, 2024 12:57PM
ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలోని ఇడుపుల పాయలో ఒక విద్యార్ధిని విషాదకర పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో ఇంజినీరింగ్ చదువుతున్న కుర్రి రేఖ అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఆదివారం రాత్రి వసతి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుట్ల గ్రామానికి చెందిన రేఖ ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది.
ఆదివారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఆమె వసతి భవనంపై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. ఇది గమనించిన తోటి విద్యార్థులు, అక్కడి సిబ్బంది ప్రాథమిక చికిత్స కోసం ట్రిపుల్ఐటీలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడప సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో రేఖ మృతిచెందింది.
ఇంజినీరింగ్ కోర్సు పూర్తయ్యింది. మరో 10 రోజుల్లో ఇంటికి వెళ్లాల్సిన ఉండగా సూసైడ్ చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ట్రిపుల్ఐటీ డైరెక్టర్ కుమారస్వామిగుప్త, హాస్టల్ సంక్షేమ అధికారి ఇమ్రాన్ షరీఫ్ విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలు రేఖ మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె బలవన్మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.