ప్రశాతంగా సాగుతున్న మూడో విడత పోలింగ్

సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 93 నియోజకవర్గాలలో ఈ  విడతలో పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాటు చేసింది.

కాగా తొలి రెండు విడతలలో జరిగిన పోలింగ్ లో బీజేపీ ఒకింత వెనుకబడిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. చివరకు బీజేపీ కూడా అలాగే భావిస్తోంది. ఈ నేపథ్యంలో  మూడో విడతలో ఆధిక్యత కోసం బీజేపీ ప్రచారంలో స్పీడ్ పెంచింది. విపక్షాలపై విమర్శల డోస్ పెంచింది. పలు చోట్ల విద్వేష ప్రసంగాలకూ వెనుకాడలేదు. దీంతో మూడో విడత పోలింగ్ సరళి ఎలా ఉంటుందన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది
 
లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా నేడు (మంగళవారం) మూడో దశ పోలింగ్ మొదలైంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 93 లోక్‌సభ నియోజకవర్గాలకు ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలైంది.  వేసవితాపం నేపథ్యంలో ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్ద భారీ క్యూలలో నిలబడి ఉండటం కనిపించింది. ఈ దశలో అసోం- 4  , బీహార్-5, ఛత్తీస్‌గఢ్ -7, గోవా-2, గుజరాత్-26, కర్ణాటక-14, మధ్యప్రదేశ్-8, మహారాష్ట్ర-11, ఉత్తరప్రదేశ్ -10, పశ్చిమ బెంగాల్-4, కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ-2 లోక్ సభ నియోజకవర్గాలకు  పోలింగ్ జరుగుతోంది. మరోవైపు మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ లోక్‌సభ స్థానానికి కూడా పోలింగ్ మొదలైంది. రెండో దశలోనే ఇక్కడ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి మరణించడంతో మూడో దశకు వాయిదా పడింది. ఈ దశలో మొత్తం 1,300 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్‌లో  తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.